బైడెన్‌కే ‘లిటిల్‌ ఇండియా’ ఓట్లు

4 Nov, 2020 18:23 IST|Sakshi

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో అత్యధికంగా భారతీయులు ఉంటారన్న విషయం తెల్సిందే. అందుకే దాన్ని ‘లిటిల్‌ ఇండియా’ అని వ్యవహరిస్తారు. ఎడ్సన్‌లోని జీపీ స్టీఫెన్స్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఉదయం పది గంటల నుంచి 12 గంటలలోపే 200 ఓట్లు పడ్డాయి. సాయంత్రానికల్లా బ్యాలెట్‌ పత్రాలు అయిపోయాయన్న వార్త తెల్సింది. మునుపెన్నడు లేనంతగా అక్కడ పోలింగ్‌ జరిగింది. అక్కడే కాకుండా న్యూజెర్సీ అంతటా ముమ్మరంగా పోలింగ్‌ జరిగింది. భారతీయ అమెరికన్‌ ఓటర్లంతా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొన్నారు. (అమెరికా అధ్యక్ష ఫలితాలపై ఎందుకు ఆసక్తి?)

‘గత ఎన్నికల వరకే నాకు ఓటు హక్కు వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో నేను ఓటు వేయలేదు. ఈసారి కృతనిశ్చయంతో ఓటింగ్‌కు వచ్చానని అక్కడికెళ్లిన భారతీయ మీడియాతో నరేంద్ర కాంచీ అనే ఓటరు తెలిపారు. జో బైడెన్, కమలా హారిస్‌కే తాను ఓటేసినట్లు ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను కూడా వారికే ఓటు వేసినట్లు ఎడ్సన్‌ పోలింగ్‌ కేంద్రంలో పోల్‌ వర్కర్‌గా స్వచ్ఛందంగా సేవలందిస్తున్న కొలంబియా యూనివర్శిటీ విద్యార్థిని మిల్లీ తెలిపారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాతి విద్వేషాలను రెచ్చ గొడుతున్నందున ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వచ్చిందని చెప్పారు. భారతీయులు శాంతియుత పరిస్థితులు కోరుకుంటున్నారని, తుపాకీ సంస్కృతిని కాదని బైడెన్‌కు ఓటేసిన గుజరాత్‌కు చెందిన 84 ఏళ్ల శారదాబెన్‌ పటేల్, ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
(ముందస్తు ఓటింగ్‌తో నష్టమా, లాభమా?!)

మొదటి సారి ఓటు హక్కు వచ్చిన జేపీ స్టీవెన్స్‌ కాలేజీ గ్రాడ్యువేట్‌ అలేఖ్య బంట్ల, 19 ఏళ్ల శ్రీనివాసన్‌ రామకష్ణన్‌ ఎవరికి ఓటేశారో మీడియాకు చెప్పడానికి సిగ్గు పడ్డారు. ట్రంప్‌ మళ్లీ అధికారంలోకి వస్తే పన్నులు తగ్గిస్తారని తమ తల్లిదండ్రులు చెప్పడం వల్ల తాము ట్రంప్‌కు ఓటు వేసినట్లు కొత్త ఓటర్లను పదే పదే ప్రశ్నించగా చెప్పారు. బైడెన్‌కు ఓటేసిన భారతీయ అమెరికన్లు ఆ విషయాన్ని బహిరంగంగా చెబుతుండగా, ట్రంప్‌కు ఓటేసిన వారు బయటకు చెప్పలేక పోతున్నారు. ట్రంప్‌కు ఓటేశానంటే ఎక్కడ తిడతారోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఏదేమైన అక్కడి భారతీయ–అమెరికన్లలో ఎక్కువ మంది బైడెన్‌కే ఓటు వేసినట్లు చెప్పారు. (కుట్ర జరుగుతోంది, సుప్రీం కోర్టుకు వెళతాం: ట్రంప్‌)

మరిన్ని వార్తలు