కాబూల్‌ పేలుడు: బిడ్డకు భర్త పేరు పెట్టుకున్న యూఎస్‌ అమర సైనికుని భార్య

16 Sep, 2021 18:04 IST|Sakshi

కాబూల్ ఉగ్రవాద పేలుడులో మరణించిన ఓ సైనికుడి భార్య ఇటీవల ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె తన భర్త జ్ఞాపకార్థం తన కూతురుకి అతని పేరు పెట్టుకుంది. దురదృష్టవశాత్తు బేబీ లెవీ రైలీ రోజ్ పుట్టినప్పటి నుంచి తన వీరోచిత తండ్రి రైలీ మెక్‌కొల్లమ్‌ని చూడలేదు. ఆగస్టు 26న కాబూల్ విమానాశ్రయంలో జరిగిన భయానక బాంబు దాడిలో రైలీ మరణించాడు. ఆ ఘటనలో 170 మంది స్థానికులు, 13 మంది యూఎస్‌ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే.

కాగా, ఆ పేలుడుకు తాము బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్‌-కే ప్రకటించింది. ఆఫ్గన్‌ నుంచి తరలింపు ప్రారంభమైన కారణంగా రైలీని యూఎస్‌ ప్రభుత్వం అక్కడికి పంపింది. ఘటన జరిగిన రోజు విమానాశ్రయ తనిఖీ కేంద్రం నిర్వహిస్తున్నప్పుడు ఈ విషాదం చోటు చేసుకుని ఉండొచ్చని అధికారులు తెలిపారు. రైలీ మెక్‌కొల్లమ్‌కి ఈ ఫిబ్రవరిలో వివాహం జరిగింది. 

రైలీ దేశ సేవలో ప్రాణాలు కోల్పోయినందుకు తాను చాలా గర్వపడుతున్నానని అతని తల్లి తెలిపింది. అనంతరం ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసింది. 15 సంవత్సరాల క్రితం, తొమ్మిది వారాల గర్భవతిగా ఉన్నప్పుడు తన భర్త మరణించాడని, దురదృష్టవశాత్తు అదే చరిత్ర పునరావృతమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

చదవండి: చైనా మరో కుతంత్రం..! ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణం..!

మరిన్ని వార్తలు