ప్రాజెక్టులతో మత్స్య రంగం అభివృద్ధి

12 Nov, 2023 01:24 IST|Sakshi
మాట్లాడుతున్న పిట్టల రవీందర్‌

మంథని: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే రాష్ట్రంలో మత్స్య రంగం అభివృద్ధి చెందిందని తెలంగాణ ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ పిట్టల రవీందర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంతో పోల్చితే ప్రస్తుతం మత్స్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. 2లక్షల టన్నుల ఉత్పత్తి ఉన్న చేపలు ఏకంగా 4.37లక్షల టన్నులకు చేరిందని తెలిపారు. కాళేశ్వరంతోపాటు అనుబంధ బ్యారేజీలు, రిజర్వాయర్లతో 4లక్షల హెక్టార్ల నీటి విస్తీర్ణం నుంచి 7లక్షల హెక్టార్లకు పెరిగిందన్నారు. చేపలవేట వృత్తిపై ఆధారపడిన వారు గతంలో 2.80లక్షల మంది ఉండగా, ప్రస్తుతం వారిసంఖ్య 4లక్షల వరకు చేరిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ సర్కారు దాదాపు రూ.1,000 కోట్లతో మత్స్య కారులకు మోపెడ్‌, బోలెరో వంటి వాహనాలు అందించిందని గుర్తుచేశారు. మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు అందించేందుకు గత 8ఏళ్లలో రూ.580 కోట్లు ఖర్చు చేసిందని, తద్వారా సుమారు రూ.33వేల కోట్ల విలువైన చేపల ఉత్పత్తి సాధించుకోగలిగామని, ఇది కేవలం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన విధానంతోనే సాధ్యమైందన్నారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్‌ వరకు దాదాపు 175 కిలో మీటర్ల పొడవున ఉన్న గోదావరి నది ప్రవాహాన్ని ఫిషరీస్‌ కారిడార్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శ్రీరాంసాగర్‌, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, బ్యారేజీలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులను కలుపుకొని మంథనిలో ప్రత్యేక చేపల అభివృద్ధి మండలి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది మత్స్య కారులు ఉంటే అందులో సుమారు 80శాతం మంది ముదిరాజులేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్‌లకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది బీఆర్‌ఎస్‌ సర్కారేనన్నారు. అలాంటి బీఆర్‌ఎస్‌ పార్టీపై కొంత మంది అపవాదం మోపాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కముదిరాజ్‌ లేరని ఆరోపణలు చేస్తున్నారని, ఇది అర్థరహితమన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు పిల్లి శేఖర్‌, నాయకులు నూనె కుమార్‌, చొప్పరి శివరాజ్‌, పిడుగు భూమ య్య, రెడ్డి శేఖర్‌, అనవేని మల్లేశ్‌ పాల్గొన్నారు.

ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ పిట్టల రవీందర్‌

మరిన్ని వార్తలు