కరీంనగర్ అర్బన్: జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా పోలీస్ పరిశీలకుడు సతీశ్ గణేశ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో సాధారణ, పోలీస్ పరిశీలకులు జిల్లా ఎన్నికల అధికారి, సీపీతో కలిసి ఎన్నికల విధులపై నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటవంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. పోలింగ్ పర్సంటేజిని పెంచేలా చూసుకోవాలని, నేటి నుంచి పోలింగ్ ముగిసే వరకు చేపట్టాల్సిన పనులు, అంశాలపై సమీక్షించుకోవాలని అన్నారు. అవసరమైన చోట అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాంకు ఖాతా ల ద్వారా ఎక్కువ మొత్తం లేదా ఎక్కవసార్లు జరిపిన లావాదేవీలపై దృష్టిసారించి ప్రతిరోజు నివేదికలను అందజేయాలని ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై వివరించారు. 23,880మంది దివ్యాంగులు, 19,594 మంది వృద్ధుల కోసం ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. హోమ్ ఓటింగ్లో భాగంగా బీఎల్వోల ద్వారా ఫామ్–12డీలను అందించామని అన్నారు. నాలుగు నియోజక వర్గాలలో 1338 కేంద్రాలలో 289 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి 60 నుంచి 70శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. నాలుగు నియోజకవర్గాలలోని 10,59,217 ఓటర్ స్లిప్పులను కూడా సిద్ధం చేయించడం జరుగుతుందని తెలిపారు. సీపీ అభిషేక్ మహంతి మాట్లాడుతూ.. జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ బృందాల ద్వారా ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని, చెక్ పోస్టుల్లో ప్రతివాహనాన్ని పరిశీలిస్తూ పట్టుబడిన వాటిని వెంటనే అర్వోలకు అందించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర సాధారణ పరిశీలకులు సి.ఆర్.ప్రసన్న, ఎం.ఆర్.రవికుమార్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, డీఆర్వో పవన్ కుమార్ పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల జిల్లా పోలీస్ అబ్జర్వర్ సతీశ్ గణేశ్