Pradeep Guha: నిర్మాత కన్నుమూత, బీటౌన్‌ ప్రముఖుల సంతాపం

21 Aug, 2021 20:25 IST|Sakshi

సాక్షి, ముంబై: మీడియా మొగల్  సినీ నిర్మాత  ప్రదీప్ గుహ (60) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. స్టేజ్ -4 క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనను ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు.​ ఆయనకు శుక్రవారం వెంటిలేటర్‌పై  చికిత్సఅందించారు. కానీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో పలువురు బీటౌన్  సెలబ్రిటీలతోపాటు, ఇతర  ప్రముఖులు ప్రదీప్ గుహ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రదీప్‌ గుహ మృతిపై నటుడు, మనోజ్ బాజ్‌పేయి, సుభాష్ ఘాయ్‌ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. హీరోయిన్లు దియామీర్జా, లారా దత్తా మిస్ ఆసియా పసిఫిక్ పోటీల నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ రాశారు. ఒక గొప్ప శక్తిని కోల్పోయామంటూ విచారం వ్యక్తం చేశారు. గత 21 సంవత్సరాలుగా తనకు ధైర్యాన్నిచ్చిన వ్యక్తి అంటూ ఆయనకు నివాళులర్పించారు.

2000 సంవత్సరంలో అందాలపోటీదారులకు మార్గదర్శకులలో ప్రదీప్ ఒకరని తెలిపారు. కళాకారులు, రచయితలు, మీడియా నిర్వాహకులకు మార్గదర్శకుడిగా, ప్రకటనల దిగ్గజం’ గా ఆస్ట్రేలియా బేస్డ్‌ మీడియా టెక్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ చార్ల్టన్ డిసిల్వా గుర్తు చేసుకున్నారు. మీడియా అమ్మకాలను ఆకర్శణీయంగా చేసిన ఘనత ప్రదీప్‌ గుహాకే దక్కుతుందన్నారు. ఇంటర్నేషనల్‌ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మాజీ అధ్యక్షుడైన ప్రదీప్‌ అస్తమయంపై దేశంలో అంతర్జాతీయ ప్రకటనల సంస్థ కూడా సంతాపం తెలిపింది. 

కాగా9ఎక్స్‌ మీడియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నా ప్రదీప్‌ గుహ  టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్,  జీ నెట్‌వర్క్ వంటి అనేక సంస్థలలో పనిచేశారు. ఆయనకు భార్య పాపియా గుహా, కుమారుడు సంకేత్ ఉన్నారు. హృతిక్ రోషన్, కరిష్మా కపూర్ నటించిన 'ఫిజా' ,  మిథున్-డింపుల్ కపాడియా జంటగా 'ఫిర్ కభీ' చిత్రాలను  గుహ నిర్మించారు.

మరిన్ని వార్తలు