Sonusood: కాపాడుకుందాం..అందరి ఆశీస్సులు కావాలంతే!

12 Jul, 2021 13:24 IST|Sakshi

మరోసారి సోనూ సూద్‌ ఔదార్యం

 బాధితుడి ఎయిర్‌ లిఫ్టింగ్‌కు ఏర్పాటు

హైదరాబాద్‌లో  ఊపిరితిత్తుల మార్పిడి  ఆపరేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నటుడు సోనూ సూద్‌ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్‌ నిమిత్తం ఒక రోగిని ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు ఆయన ట్విటర్‌ వివరాలను షేర్‌ చేశారు.బాధితుడి సోదరుడు ట్విటర్‌ ద్వారా చేసిన విజ్ఞప్తికి స్పందించిన సోనూ సూద్‌, ఆపరేషన్ ఖర్చును భరించడంతోపాటు, అతణ్ని ఆసుపత్రికి తరలించేందుకు రేపు(మంగళవారం) ఏర్పాటు చేసినట్టు సోమవారం ట్వీట్‌ చేశారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రతీ భారతీయుడు ప్రార్థించాలని  కూడా  కోరారు.

వివరాల్లోకివెళితూ.. హితేశ్‌ శర్మ(44) ఇటీవల కోవిడ్‌ బారిన పడ్డారు. యూపీ, నోయిడాలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న ఆయన లంగ్స్‌ పూర్తిగా పాడై పోయాయి. ఊపిరితిత్తుల మార్పిడి ఒక‍్కటే మార్గమని వైద్యులు తేల్చేశారు. ఏప్రిల్ నుండి ఆసుపత్రిలో అతని చికిత్స కోసం ఉన్న సొమ్మంతా ఖర్చు పెట్టేశారు కుటుంబ సభ్యులు. 12 ఏళ్ల పాప, ఏడేళ్ల  బాబు ఉన్న హితేశ్‌కు  కరోనా మహమ్మారితో ఇప్పటికే తన తల్లిదండ్రులు కన్నుమూసిన సంగతి తెలియదు.

మరోవైపు హితేశ్‌ను బతికించుకోవాలంటే, లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, పోస్ట్ ట్రామా ట్రీట్‌మెంట్‌, రికవరీ, హాస్పిటల్ ఖర్చులు, ఇవన్నీ కలిపి సుమారు రూ .1,50,00,000 (ఒక కోటి యాభై లక్షలు) అవసరం. దీంతో ఎలాగైనా భర్తను హితేశ్‌ను రక్షించుకునేందుకు భార్య పూజ క్రౌడ్‌ ఫండింగ్‌కు ప్రయత్నించారు. అయినా తగినంత డొనేషన్స్‌ రాకపోవడంతో హితేశ్‌ సోదరుడు ట్విటర్‌ ద్వారా మరోసారి సోనూను ఆశ్రయించారు. ఇప్పటికే కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయాననీ, ఇపుడు సోదరుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని పేర్కొన్నాడు. సోదరుడిని కాపాడుకోలేక పోతే తానిక అనాధగా మిగిలిపోతాను.. సాయం చేయాలని వేడుకున్నాడు. .తనకున్న ఏకైక ఆశ మీరే అంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో సోనూ సూద్‌  వేగంగా  స్పందించారు. ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా హితేశ్‌ను హైదరాబాద్‌కు తరలించనున్నామంటూ ట్వీట్‌ చేయడం విశేషం.

>
మరిన్ని వార్తలు