బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ బలవన్మరణం కేసులో అతని ప్రేయసి, నటి రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సుశాంత్ మరణం కేసులో సీబీఐ, మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ, నిషేధిత మాదక ద్రవ్యాల కేసులో ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) రియాను విచారిస్తున్నాయి. అయితే తనతో పాటు తన కుటుంబం విచారణకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నామని కానీ మాకు మాత్రం ఎవరూ అనుకూలించడం లేదని రియా చక్రవర్తి అన్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో గురువారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో రియా ఇంటి ముందు ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి ప్రశ్నలు కురిపించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కరోనా నిబంధనలు కూడా పట్టించుకోనట్లు తెలుస్తోంది. (చదవండి: రియా చక్రవర్తిపై నార్కోటిక్ కేసు)
ఈ ఘటనపై రియా అసహనం వ్యక్తం చేశారు. "మేము ఇల్లు దాటి బయటకు వచ్చి ఈడీ, సీబీఐ సహా ఇతర దర్యాప్తు సంస్థల విచారణకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ నాతో పాటు, నా కుటుంబ సభ్యుల జీవితం ప్రమాదంలో ఉంది. మాకు రక్షణ కల్పించాలని పోలీసులను, దర్యాప్తు అధికారులను కోరాము. ఎవరూ మాకు సాయం చేయలేదు. మేము ఎలా ముందుకువెళ్లాలి? కేవలం విచారణకు వెళ్లేందుకు మాకు రక్షణ కల్పించాలని అడుగుతున్నాం. ఈ విషయంలో మాకు ఎలాగైనా సాయం చేయాలని ముంబై పోలీసులను అభ్యర్థిస్తున్నా" అని రాసుకొచ్చారు. (చదవండి: రియా, మహేష్ భట్ల వాట్సాప్ చాట్ వైరల్)