రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు దారుణహత్య

23 Dec, 2023 11:28 IST|Sakshi

బొమ్మలసత్రం: జిల్లా కేంద్రం నంద్యాలలోని ఎన్‌జీవోస్‌ కాలనీలో రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు గ్లాడియా (65) శుక్రవారం దారుణహత్యకు గురయ్యారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. సుధాకర్‌రావు, గ్లాడియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు ఇద్దరికి వివాహాలు కావడంతో ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. దూరదర్శన్‌ చానల్‌లో ఏడీగా పనిచేసి రిటైర్డ్‌ అయిన సుధాకర్‌రావు ఏడాది క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు గ్లాడియా ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. శుక్రవారం ఉదయం ఆమె ఇంట్లో పనిమనిషి రాగా ఇంటికి తలుపులకు తాళం వేసి ఉండటంతో అనుమానంతో కిటికీ నుంచి తొంగి చూడగా మంచంపై గ్లాడియా రక్తపుమడుగులో పడి ఉన్నారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో సంఘటనా స్థలానికి డీఎస్పీ మహేశ్వర రెడ్డి, సీఐలు ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు హుటాహుటిన చేరుకున్నారు. తలుపులు తెరిచి చూడగా గ్లాడియా నోట్లో బట్టలు కుక్కి, కారంపొడి చల్లి కత్తితో పొడిచిన గాయాలను పోలీసులు గుర్తించారు. బీరువాలో ఉన్న గ్లాడియా బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తిపత్రాలను దుండగులు అపహరించినట్లు గమనించారు.

సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన దృశ్యాలను పరిశీలించగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కారు గ్లాడియా ఇంటి సమీపంలో తిరిగినట్లు గుర్తించారు. అయితే ఎవరైనా దొంగలు రిక్కీ నిర్వహించి గ్లాడియాను హత్య చేసి దొంగతనానికి పాల్పడ్డారా..లేక తెలిసి వారు ఎవరైనా కావాలనే ఆమెను హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గ్లాడియా పెద్ద కుమార్తె శృతి ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

>
మరిన్ని వార్తలు