నంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతతో పాటు నూతన ఆవిష్కరణలు లక్ష్యంగా వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. విద్యార్థుల్లో వైజ్ఞానిక విజ్ఞానం పెంపొందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా వైజ్ఞానిక పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 23న జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలోని గురురాజ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి సుధాకర్రెడ్డి సూచనలు మేరకు ప్రతి మండలం నుంచి మూడు ప్రాజెక్టుల చొప్పున దాదాపు 140 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, గణిత, ఖగోళ, పర్యావరణ, జీవ శాస్త్రాలతో పాటు ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్ట్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 10 ఉత్తమ ప్రాజెక్ట్లను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని జిల్లా సైన్స్ అధికారి సుందర్రావు తెలిపారు. గత ఏడాది కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన ఆరోగ్యం పరిరక్షణ, పర్యావరణ హిత పదార్థాల వాడకం ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు డీఈఓ తెలిపారు.
నేడు జిల్లా స్థాయి సైన్స్ఫేర్ ప్రారంభం
ఏర్పాట్లు పూర్తి చేసిన
జిల్లా విద్యాశాఖ అధికారులు
ప్రదర్శనకు 140 ప్రాజెక్టులు ఎంపిక