ఈ ప్రదర్శనను ఆపండి...!

25 Nov, 2023 06:12 IST|Sakshi

యూపీ మంత్రిని వారించిన వీర జవాను తల్లి

న్యూఢిల్లీ: ఒక వైపు కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న ఓ మాతృమూర్తి..పరిహారం చెక్కు ఇస్తూ ఫొటో తీయించుకోవాలనే మంత్రి యావను చూసి అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రదర్శనను ఆపండి’ అంటూ అక్కడున్న వారిని వేడుకున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మంత్రి తీరును ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఎండగట్టారు.

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో యూపీలోని ఆగ్రాకు చెందిన కెప్టెన్‌ శుభమ్‌ గుప్తా అసువులు బాశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కు అందజేసేందుకు మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్‌ శుక్రవారం ఆయన కుటుంబాన్ని కలుసుకున్నారు. తీవ్ర శోకంలో ఉన్న కెప్టెన్‌ శుభమ్‌ గుప్తా తల్లితో మంత్రి మాట్లాడారు. అనంతరం పరిహారం చెక్కు ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నించగా ఆమె తీసుకోలేదు. ‘నాకు ఏమీ వద్దు, ఈ ఎగ్జిబిషన్‌(ప్రదర్శని మత్‌ లగావో)ను ఇక ఆపండి’ అంటూ వేడుకున్నా చెక్కును అలాగే పట్టుకుని ఫొటో తీయించుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో రికార్డయింది.

మరిన్ని వార్తలు