‘మనీష్‌ సిసోడియా ‘భారతరత్న’కు అర్హుడు.. అలాంటి వ్యక్తిపై సీబీఐ దాడులా?’

22 Aug, 2022 16:02 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో అవకతవకలపై సీబీఐ దాడుల నేపథ్యంలో బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధ తారస్థాయికి చేరుకుంది. ఇరుపార్టీల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాలు గుజరాత్‌లో పర్యటించారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నెలరోజుల్లోనే ఐదోసారి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కేజ్రీవాల్‌. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

‘నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలను తయారు చేసి అద్భుతం చూపించిన వ్యక్తిపై సీబీఐ దాడులు చేసింది. మీకు సిగ్గుగా లేదా? అలాంటి వ్యక్తికి భారత రత్న ఇవ్వాలి. విద్య కోసం ఆయనని సంప్రదించాలి. ఆయన విషయంలో జరుగుతున్న పరిణామాలతో దేశంలోని ప్రతిఒక్కరు నిరాశకు గురవుతున్నారు. మనీష్‌ సిసోడియా అరెస్ట్‌ కావచ్చు. నన్ను కూడా అరెస్ట్‌ చేయొచ్చు. ఇదంతా గుజరాత్‌ ఎన్నికల కోసమే చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్‌. మరోవైపు.. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి వ్యతిరేకంగా సిసోడియాపై సీబీఐ దాడుల అంశాన్ని లేవనెత్తనున్నట్లు ఆప్‌ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: Manish Sisodia: ‘ఆప్‌ని వదిలేసి బీజేపీలో చేరమని మెసేజ్‌ పంపారు’

మరిన్ని వార్తలు