భర్త, అత్తలను ఫ్రిడ్జ్‌లో! ఆరు నెలల తర్వాత వెలుగులోకి..

20 Feb, 2023 19:26 IST|Sakshi
నిందితురాలు వందన

ఆమె నేరం చేసినట్లయితే ఆమెను కాల్చివేయండయ్యా. అలాంటి కూతురు నాకు వద్దు. వివాహేతర సంబంధంతో భర్త, అత్తలను చంపడం ఏంటయ్యా?. ఒకవేళ నిజంగా ఆమె తన భర్తను, అత్తగారిని చంపి ఉంటే నాకు ఆమెతో ఎలాంటి సంబంధం ఉండదు.. తన కన్నకూతురిని ఉద్దేశించి ఓ తండ్రి చెప్తున్న మాటలివి. 

గువాహతి: దేశంలో జరుగుతున్న ఒక తరహా నేరాలు-ఘోరాలపై విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రేమ.. సహజీవనం.. పెళ్లిమాటొచ్చేసరికి చంపేయడం లాంటి వరుస ఘటనలు చూస్తున్నాం.  ఈ నేరాలను స్ఫూర్తిగా తీసుకుందేమో.. అసోంలో ఒకావిడ భర్త, అత్తలను ఆ కేసుల తరహాలోనే హతమార్చింది. 

అసోం గువాహతి సమీపంలో నూన్‌మతికి చెందిన ఓ వివాహిత.. భర్త, అత్తలను కడతేర్చి ముక్కలు చేసింది. ఆ ముక్కలను ఫ్రిడ్జ్‌లో భద్రపరిచింది. ఆపై ప్రియుడి సాయంతో వాటిని దూరంగా పడేసి వచ్చింది. దాదాపు ఆరు నెలల తర్వాత.. ఇది వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త, అత్తలు అడ్డువస్తున్నారనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందట.  

నిందితురాలి పేరు వందనా కలిటా. భర్త పేరు అమర్‌జ్యోతి దే. అత్త పేరు శంకరీ దే. కిందటి ఏడాది ఆగష్టు నెలలో వాళ్లను ప్రియుడు, మరొక వ్యక్తి సాయంతో చంపేసి ముక్కలు చేసింది వందన. ఆపై ప్లాస్టిక్‌ సంచుల్లో నిల్వ చేసి.. ఫ్రిడ్జ్‌లో భద్రపరిచింది. మూడు రోజుల తర్వాత ప్రియుడి సాయంతో ఆ శరీర విడి భాగాలను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజి(మేఘాలయా)కు తీసుకెళ్లి.. అక్కడ సోహ్రా ప్రాంతంలో వాటిని పడేసింది.  

తిరిగొచ్చి ప్రియుడితో కలిసి ఉంటోంది. ఏడు నెలలపాటు వాళ్ల గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా జాగ్రత్త పడింది. తన కన్నతండ్రికి సైతం ఏం చెప్పకుండా ఉండిపోయింది. చివరికి.. దగ్గరి బంధువు ఒకరు అమర్‌, శంకరీల గురించి ఆరా తీయడంతో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్తూ వచ్చింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు తమ శైలిలో విచారణ చేపట్టారు. చివరాఖరికి.. ఫిబ్రవరి 19వ తేదీన ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితురాలు వందనతో పాటు ఆమె ప్రియుడు అరుప్‌ డేక, అరుప్‌ స్నేహితుడు ధాంజిత్‌ డేకాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.   

అత్తాభర్తల అదృశ్యం గురించి ఆమె(వందన) నాటకాలాడిందని, ఒకవేళ ఆమె నేరం చేసిందని రుజువైతే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాలని వందన తండ్రి పోలీసులను కోరుతున్నాడు. వివాహేతర సంబంధం తనకు భర్త, అత్తకు తెలిసిందని, వాళ్లు హెచ్చరించడంతోనే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె పోలీసుల ముందు ఒప్పుకుంది. ఇదిలా ఉంటే శ్రద్ధా వాకర్‌ హత్య కేసు, తాజాగా నిక్కీ యాదవ్‌ కేసులోనూ ఫ్రిడ్జ్‌లో బాడీ విడిభాగాలు, బాడీని భద్రపర్చడం తెలిసిందే. 

మరిన్ని వార్తలు