శ్రీనగర్ సీఆర్‌పీఎఫ్ ఐజీగా చారు సిన్హా నియామకం

1 Sep, 2020 17:42 IST|Sakshi

న్యూఢిల్లీ : శ్రీనగర్‌ సెక్టార్ సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్( సీఆర్‌పీఎఫ్‌) ఇన్స్పెక్టర్ జనరల్‌గా మహిళా అధికారి చారు సిన్హా నియమితులయ్యారు. శ్రీనగర్ సెక్టార్‌కు తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు ఏ మహిళా ఐపీఎస్ అధికారి కూడా ఆ పోస్టులో నియామకం కాలేదు. చారు సిన్హా తెలంగాణ 1996 కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. గతంలో ఈమె సీఆర్‌పీఎఫ్‌ బిహార్ సెక్టార్ ఐజీగా పనిచేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతామైన ఈ సెక్టార్‌లో‌ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించారు. అనంతరం జమ్మూ ఐజీగా బాధ్యతలు చేపట్టి చాలాకాలం పనిచేశారు. ఈ క్రమంలో సోమవారం ఆమెను శ్రీనగర్‌ ఐజీగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అ‍య్యాయి. (తాళ్లు, ట్రెక్కింగ్‌ పరికరాలతో చొచ్చుకువచ్చారు)

కాగా 2005 లో శ్రీనగర్ సెక్టార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ ఐజీ స్థాయిలో మహిళా పోలీస్ ఆఫీసర్ ఎవరూ లేరు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు ఇండియన్ ఆర్మీతోను, జమ్మూ కశ్మీర్ పోలీసులతోను చారు సిన్హా సమన్వయంతో పని చేయవలసి ఉంటుంది. సీఆర్పీఎఫ్ శ్రీనగర్ సెక్టార్ పరిధిలో రెండు రేంజ్‌లు, 22 ఎగ్జిక్యూటివ్ యూనిట్లు, మూడు మహిళా పోలీసు కంపెనీలు, పారామిలటరీ బలగాలు ఉన్నాయి. వాటన్నింటికీ చారు సిన్హా హెడ్‌గా వ్యవహించనున్నారు.

మరిన్ని వార్తలు