ఆ రెండు యాప్‌లు ప్లే స్టోర్‌ నుంచి మాయం!

4 Aug, 2020 13:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ట్విట్టర్, గూగుల్ సెర్చింజన్‌కు‌ ప్రత్యామ్నాయాలుగా పిలువబడే చైనాకు చెందిన యాప్స్‌ వీబో,  బైడు సెర్చింజన్‌ను  కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించినట్టు తాజాగా వెలువడిన నివేదికలు ద్వారా వెల్లడవుతోంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈ రెండు యాప్‌లను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. జూలై 27 న భారత ప్రభుత్వం నిషేధించిన 47 కొత్త యాప్‌లలో వీబో, బైడు సెర్చింజన్‌ కూడా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వీటితో పాటు చైనాకు చెందిన మరిన్ని యాప్‌లను నిషేధించే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తోందని వారు వెల్లడించారు. 

భారతదేశం, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చైనాకు చెందిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వైబో నుంచి  ప్రధాని నరేంద్ర మోదీ వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన 59 యాప్‌లను జూన్ 29 న భారత ప్రభుత్వం ఇదివరకే నిషేధించింది. వినియోగదారులకు చెందిన సున్నితమైన సమాచారాన్ని తస్కరించడం ద్వారా భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయన్న కారణంగా ఆ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. పబ్జీ యాప్‌ను కూడా తొలగించడానికి మోదీ సర్కార్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్‌ కంట్రీకి చెందిన మరో 275 యాప్‌లను కూడా కేంద్రం తొలగించాలనుకుంటున్నట్లు సమాచారం.
చదవండి: టిక్‌టాక్‌ : ట్రంప్ తాజా డెడ్‌లైన్‌

మరిన్ని వార్తలు