హిమాచల్‌లో అదే ఉత్కంఠ.. సీఎం అభ్యర్థి ఎంపికలో ప్రియాంకపైనే భారం!

10 Dec, 2022 12:43 IST|Sakshi

షిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్‌ పార్టీ. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శుక్రవారం భేటీ అయినా సీఎం పేరు ఖరారు కాలేదు. దీంతో అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధిష్టానానికి కట్టబెడుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు ఎమ్మెల్యేలు. హిమాచల్‌లో తదుపరి ముఖ్యమంత్రి రేసులో ప్రతిభా సింగ్‌, ముకేశ్‌ సింగ్‌ అగ్నిహోత్రి, సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు ముందంజలో ఉన్నారు.

ప్రియాంక గాంధీకే క్రెడిట్‌..
హిమాచల్‌లో పార్టీ విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం మధ్యాహ్నం కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రియాంక ప్రకటించనున్నారని పేర్కొన్నాయి. హిమాచల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పార్టీని ముందుండి నడిపించారు. ఏఐసీసీ ‍అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహంలో కీలక భూమిక పోషించారు. బీజేపీనీ ఓడించి పార్టీని గెలిపించటంలో ప్రియాంక పాత్ర కీలకమైందని పలువురు నేతలు ప్రశంసలు కురిపించారు. ఈక్రమంలోనే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యత ఆమెకే అప్పగించినట్లు తెలుస్తోంది.

సీఎంగా ముకేశ్‌.. విక్రమాదిత్యకు డిప్యూటీ..! 
ముఖ్యమంత్రి పదవి రేసులో ప్రతిభా సింగ్‌, ముకేశ్‌ ‍అగ్నిహోత్రి, సుఖ్విందర్‌ సింగ్‌ సుఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే, ముకేశ్‌ అగ్నిహోత్రికి ముఖ్యమంత్రి పదవి, విక్రమాదిత్యకు డిప్యూటీ సీఎం ఇచ్చే యోచనలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, చివరకు ఎవరికి ఆ పదవి దక్కుతుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.

ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్‌లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్‌

మరిన్ని వార్తలు