Covid 4th Wave: కరోనా ఫోర్త్‌ వేవ్‌పై వార్తలు.. ఐసీఎంఆర్‌ ఏడీజీ సమీరన్ ఏమన్నారంటే?

11 Jun, 2022 13:19 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్-19 ఫోర్త్‌ వేవ్‌ ముప్పు రానుందన్న వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ (అడ్మినిస్ట్రేటివ్‌ సెటప్‌ డైరెక్టర్‌) సమీరన్ పాండా శుక్రవారం అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరగడాన్ని దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకోలేమని చెప్పారు.  దేశంలో కనిపించే రూపాంతరం చెందిన ప్రతీ వైరస్‌ ఆందోళన కలిగించేది కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.

మాక్స్ హెల్త్‌కేర్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ రోమెల్ టిక్కూ మాట్లాడుతూ.. కోవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ని భారత్‌ ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాదాపు లేదని తెలిపారు. భారత్‌లో కేసులు నమోదవుతున్నప్పటికీ వైరస్‌ మునుపటిలా ప్రమాదకరంగా మారి వ్యాప్తి జరిగే అవకాశం లేదని అన్నారు. మరో వైపు దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. ప్రజలు కోవిడ్‌-19 ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్షల సంఖ్యను పెంచాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సోకిన వ్యక్తుల నమూనాలను పంపాలని ఐదు రాష్ట్రాలు.. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులను భూషణ్ తన లేఖలో కోరారు. 
చదవండి: చెత్తగా తీసిన సినిమా అది.. బాలేదంతే!

మరిన్ని వార్తలు