‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమానికి అనూహ్య స్పందన!

11 Dec, 2023 09:26 IST|Sakshi

మహారాష్ట్రలోని పూణెలో ‘దో ధాగే శ్రీరామ్ కే లియే’ (శ్రీరామునికి రెండు నూలుపోగులు) ఉద్యమం ప్రారంభమైంది. అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరామునికి వస్త్రాలు సిద్ధం చేసేందుకు వేలాది మంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులకు ఉపక్రమించారు. 

ఈ ఉద్యమ ప్రచారం 13 రోజుల పాటు కొనసాగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం, పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ డిసెంబర్ 10న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారానికి ప్రజల నుంచి ఉత్సాహంతో కూడిన మద్దతు లభిస్తున్నదని ప్రచార నిర్వాహకురాలు అనఘా ఘైసాస్ తెలిపారు. రానున్న 13 రోజుల్లో ఈ పనుల్లో భాగస్వాములయ్యేందుకు దాదాపు 10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆమె తెలిపారు. 

చేనేత కళను ప్రోత్సహిస్తూనే, ఈ పనిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఈ ప్రచారం సాగుతున్నదన్నారు. చేనేత పని అంత సులభం కాదని, ఇది గణితంతో ముడిపడివుందని,  అలాగే ఎంతో సహనం  అవసరమన్నారు. శ్రీరామునికి అందించబోయే దుస్తులు పట్టుతో తయారవుతున్నాయని, వెండి బ్రోకేడ్‌తో ఈ వస్త్రాలను అలంకరిస్తామని ఆమె తెలిపారు. కాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రామమందిరం ట్రస్ట్‌కు చెందిన గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌లు ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఆ ఎంపీ అదృశ్యం అంటూ పోస్టర్లు.. ఆ చూకీ చెబితే రూ. 50 వేలు!

>
మరిన్ని వార్తలు