కోర్టుల్లో కేసుల వరుస వాయిదాలు.. సీజేఐ డీవై చంద్రచూడ్‌ అసహనం

3 Nov, 2023 18:56 IST|Sakshi

న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసులు పదేపదే వాయిదా పడటంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. ఇది కేసుల్ని వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్ధేశాన్ని దెబ్బతిస్తుందని అన్నారు. అవసరమైతే తప్ప కేసులను వాయిదా కోరవద్దని న్యాయవాదులకు సూచించారు. సుప్రీంకోర్టు 'తారిఖ్ పే తారిఖ్ కోర్టు'గా మారడం తమకు ఇష్టం లేదని అన్నారు. సుప్రీంకోర్టులో వాయిదా కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ శుక్రవారం సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. 

సెప్టెంబర్‌ 1 నుంచి నవంబర్‌ 3 వరకు 3,688 కేసుల్లో న్యాయవాదులు విచారణ వాయిదా కోరారని సీజేఐ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఒక్క రోజే(నవంబర్‌3) 178 కేసుల్లో వాయిదాలు వచ్చాయని తెలిపారు కోర్టులు వాయిదాల మీద వాయిదాలు(తారీఖ్‌-పే-తారీఖ్‌ కోర్టు) వేసే వాటిగా ఉండాలని తాము కోరుకోవడం లేదని  తెలిపారు. ఇది పౌరుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని, న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తుందని తెలిపారు.  రెండు నెలల్లోనే 3.688 కేసుల్లో వాయిదా పడటం వల్ల ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. 

‘తారిఖ్‌ పర్‌ తారిఖ్‌ కోర్టు’ ఏంటిది?
ఇక  తారిఖ్‌ పర్‌ తారిఖ్‌ కోర్టు అనేది  బాలీవుడ్‌ సినిమా ‘దామిని’ లోని డైలాగ్‌. ఈ చిత్రంలో న్యాయవాదిగా నటించిన సన్నీ డియోల్‌..  అత్యాచార బాధితురాలి తరఫున కేసు వాదిస్తారు. నిందితుడి తరఫు న్యాయవాది తన క్లైంట్‌ను కేసు నుంచే తప్పించే ఉద్దేశంతో పదే పదే వాయిదాలు కోరగా.. "tareek peh tareek" అనే పదాన్ని సన్నీ ఉపయోగిస్తాడు. ఈ డైలాగ్‌నే సీజేఐ ప్రస్తావించారు.
చదవండి: ఇదేమైనా బావుందా? కేంద్రమంత్రి సంచలన ట్వీట్‌: విస్తారా రియాక్షన్‌

మరిన్ని వార్తలు