Nirmala Sitharaman: భారీ ఉపశమన చర్యలు

28 Jun, 2021 14:56 IST|Sakshi

రూ.6.29 లక్షల కోట్లతో ఉద్దీపన

కోవిడ్‌ ప్రభావిత ఎకానమీ ఊతానికి

కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ

వైద్య, మౌలిక సదుపాయాలు, చిన్న సంస్థలపై ప్రత్యేక దృష్టి

హెల్త్‌ కేర్‌ సహా వివిధ అంశాలకు రూ. 1.1 లక్ష కోట్ల రుణ హామీ పథకం

ఈసీఎల్‌జీఎస్‌ పరిమితి రూ. 4.5 లక్షల కోట్లకు పెంపు

5 లక్షల మంది విదేశీ టూరిస్టులకు ఉచిత వీసా 

టూరిస్ట్‌ గైడ్‌లు, ఏజెన్సీలకు రుణాలు 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంనుంచి గట్టెక్కెందుకు ఊరట చర్యలను ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు పలు కీలక ఉపశమన చర్యలనుసోమవారం వెల్లడించారు. ఆర్థిక నష్టాలనుంచి గట్టెక్కేలా పలు పరిశ్రమలకు ఆర్థిక సహాయ చర్యలకు సంబంధించి కేంద్ర మంత్రి సోమవారం మీడియా సమావేశంలో పలు అంశాలను ప్రకటించారు.  వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు  భారీగా  నిధులను మంత్రిత్వ శాఖ కేటాయించింది. అలాగే అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం (ఇసిఎల్‌జిఎస్‌ పరిమితిని) రూ .4.5 లక్షల కోట్లకు పెంచింది. టైర్ 2 ,3నగరాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక శాఖ ప్రాధాన్యతనిచ్చింది. ఆత్మనిర్భర్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్టు నిర్మలా  సీతారామన్‌  తెలిపారు. కాగా, ఎరువుల సబ్సిడీ కింద అదనంగా ఇచ్చే నిధులను కూడా పరిగణనలోకి తీసుకుంటే కేంద్రం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన చర్యల విలువ సుమారు రూ. 6.29 లక్షల కోట్లకు చేరినట్లవుతుంది. 

ప్రెస్‌మీట్‌ వివరాలు:
►8 రిలీఫ్‌ ప్యాకేజీలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.
►కోవిడ్‌ వల్ల నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం
►రూ.1.1 లక్ష కోట్ల రుణహామీ పథకం‌
►ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్లు
►ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద ఆర్థికసాయం
►వైద్య, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
►టైర్‌ 2,3 పట్టణాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తాం
►ఇతర రంగాలకు  60వేల కోట్ల  లోన్‌ గ్యారంటీ
► 25 లక్షల మందికి రూ.1.25 లక్షల రుణం. దీనికి వడ్డీ గరిష్ఠంగా 2శాతం. మూడు సంవత్సరాల పరిమితితో  రుణాలు.
►డీఏపీ,  పి అండ్ కె ఎరువులకు ప్రభుత్వం అదనపు రాయితీలు. రూ. 14,775 కోట్ల మేర  రాయితీలు. డీఏపీకి రూ.9,125 కోట్లు, నత్రజనికి రూ.5,650 కోట్లు.
►అంతర్జాతీయ ప్రయాణం తిరిగి ప్రారంభమైన తర్వాత, భారతదేశానికి వచ్చే తొలి 5 లక్షల మంది పర్యాటకులకు వీసా ఫీజు రద్దు. ఈ పథకం మార్చి 31, 2022 వరకు  లేదా మొదటి 5 లక్షల వీసాలకు వర్తిస్తుంది. ఒక పర్యాటకుడు ఒక్కసారి మాత్రమే ఈ ప్రయోజనం పొందగలరు.
►ట్రావెల్ ఏజెన్సీలకు రూ .10 లక్షల రుణం
►ప్రజారోగ్యం కోసం రూ .23,220 కోట్ల అదనపు నిధులు, ప్రధానంగా పిల్లలు,  పిల్లల సంరక్షణపై దృష్టి 
► బడుగు,బలహీన వర్గాల ఆహార భద్రత కోసం గత ఏడాది ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ అన్నాయోజన పథకం 2021 నవంబర్ వరకు పొడిగింపు 
► 5 కిలోల ఆహార ధాన్యం ఉచితంగా పంపిణీ.  తద్వారా మొత్తం  వ్యయం రూ .2.27 లక్షల కోట్లు
► అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కోసం రూ .19,041 కోట్ల అదనపు సహాయం.

చదవండి : DRDO: 2-డీజీ డ్రగ్‌, కమర్షియల్‌ లాంచ్‌ 
కోవీషీల్డ్‌కు గ్రీన్ పాస్ షాక్‌!  సీరం సీఈవో భరోసా

మరిన్ని వార్తలు