ఆరేళ్ల బాలికను.. మార్కెట్‌కు తీసుకెళ్తానని చెప్పి..

3 Aug, 2021 21:05 IST|Sakshi
నిందితురాలు షబ్నం

సాక్షి, హుబ్లీ(కర్ణాటక): స్థానిక రామలింగేశ్వర నగర్‌లో ఆదివారం కిడ్నాప్‌నకు గురైన ఆరేళ్ల బాలికను గూకుల పోలీసులు బెంగళూరులో రక్షించి నిందితురాలిని 12 గంటల్లోపే అరెస్ట్‌ చేశారు. నిందితురాలు అదే ప్రాంతానికి చెందిన షబ్నంగా గుర్తించారు. వివరాలు... షబ్నం ఆదివారం సాయంత్రం తన ఇంటి ముందు ఉంటున్న అస్లాం అనే వ్యక్తి కుమార్తెను మార్కెట్‌కు తీసుకెళ్తానని చెప్పి వెళ్లింది. ఎంత సేపటికి రాకపోవడంతో పలుచోట్ల గాలించిన కుటుంబ సభ్యులు గూకుల పోలీసులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్‌ టవర్‌ ఆధారంగా బెంగళూరుకు వెళ్తున్నట్లు తెలుసుకున్నారు. నిందితురాలు స్నేహితుడి వద్దకు వెళ్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని సంప్రదించి సహకారం కోరారు. ఈ క్రమంలో షబ్నంను బెంగళూరు మెజెస్టిక్‌ బస్టాండ్‌లోనే ఉండమని చెప్పించారు. జంట నగరాల కమిషనర్‌ లాబురాం, బెంగళూరు చిక్కపేట ఏసీపీ, ఉప్పారపేట పోలీసుల సాయంతో బాలిక రక్షించి నిందితురాలిని అరెస్ట్‌ చేశారు. ఎందుకు కిడ్నాప్‌ చేసిందో దర్యాప్తు చేపట్టారు.     

>
మరిన్ని వార్తలు