‘దెయ్యాల గుంపు వేధిస్తుంది.. నన్ను కాపాడండి సార్‌’

30 Jun, 2021 12:28 IST|Sakshi

గుజరాత్‌ పోలీసులు ఎదుట వింత అభ్యర్థన

గాంధీనగర్‌: దెయ్యాలున్నాయో, లేవే తెలియదు కానీ.. వాటికి సంబంధించిన వార్తల మీద జనాలకు ఎంతో ఆసక్తి. దెయ్యాలను వదిలించే బాబాలకు మన సమాజంలో ఫుల్‌ డిమాండ్‌. ఇప్పుడు ఈ దెయ్యాల గొడవ ఎందుకంటే తాజాగా గుజరాత్‌లో ఓ వింత సంఘటన వెలుగు చూసింది. దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని.. వాటి నుంచి తన ప్రాణాలు కాపాడిల్సిందిగా ఓ వ్యక్తి ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. వింత ఫిర్యాదు చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు..

గుజరాత్‌ పంచమహల్‌ జిల్లా జంబుఘోడ తాలుగా హమ్లెట్‌ గ్రామానికి చెందిన వర్సంగ్‌భాయ్‌ బరియా(35) అనే వ్యక్తి మంగళవారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఓ దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని.. ప్రశాంతంగా ఉడనివ్వడం లేదని తెలిపాడు. మరీ ముఖ్యంగా ఆ గ్రూపులోని రెండు దెయ్యాలు తనను చంపుతామని బెదిరిస్తున్నాయని వాపోయాడు. ఎలాగైనా తన ప్రాణం కాపాడాల్సిందిగా పోలీసులను అభ్యర్థించాడు. 

బరియా మాటలు, వాలకం చూసిన పోలీసులకు కాస్త తేడా కొట్టింది. దాంతో అతడిని పక్కకు కూర్చోబెట్టి.. కుటుంబ సభ్యులను పిలిచి విచారించారు. ఈ క్రమంలో బరియా మానసిక పరిస్థితి సరిగా లేదని.. గతేడాది నుంచి చికిత్స తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గత పది రోజులగా మందులు తీసుకోవడం మానేశాడని.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులకు వెల్లడించారు. ఇక బరియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. అతడికి వైద్యం అందిచాల్సిందిగా సూచించారు.

చదవండి: వైరల్‌: ఈమె మనిషా.. దెయ్యామా?!

మరిన్ని వార్తలు