24 గంటల్లో 87,882 కేసులు

22 Sep, 2020 03:55 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 86,961 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,87,580 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,130 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 87,882కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 43,96,399 కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 10,03,299 గా ఉంది. యాక్టివ్‌ కేసులతో పోలిస్తే రికవరీ కేసులు 33 లక్షలకు పైగా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 18.28 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 80.12 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

మరణాల రేటు 1.6 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్‌ 20 వరకు 6,43,92,594 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఆదివారం మరో 7,31,534 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటివరకూ దేశంలో దాదాపు 6.3 కోట్లకుపైగా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 455 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. కరోనా వల్ల మరణిస్తున్న వారిలో 70 శాతం మంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారేనని చెప్పింది.

మరిన్ని వార్తలు