ఇండియన్​ ఆర్మీకి సలాం.. రెండు రోజులుగా మృత్యువు కౌగిలిలో కూర్చున్న యువకుడు సురక్షితం

9 Feb, 2022 13:18 IST|Sakshi

ఊహించని రీతిలో చావు అంచున వేలాడుతూ రెండు రోజులు గడిపాడు ఆ వ్యక్తి. అధికారులు ప్రయత్నించినా.. అతన్ని కాపాడడం వీలు కాలేదు. ఇక తన ప్రాణం పోవడం ఖాయం అనుకుంటూ ఆ యువకుడు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఆ తరుణంలో భారత్​ ఆర్మీ ఎంట్రీతో సీన్​ మారింది. ఆ కేరళ యువకుడి ప్రాణాలు నిలిచాయి.  

కేరళలోని పాలక్కాడ్ జిల్లా చేరాడు సమీపంలో చేరాట్ కొండలున్నాయి. వీటిని అధిరోహించాలనుకున్న ఆర్.బాబు (23), తన స్నేహితులు సోమవారం నాడు ట్రెక్కింగ్​కు వెళ్లారు. కొండ అలా ఉండడంతో కష్టంగా అనిపించడంతో ఇద్దరు స్నేహితులు మధ్యదాకా వెళ్లి కిందకు వచ్చేశారు. కానీ, బాబు మాత్రం ధైర్యంగా ముందుకెళ్లి కొండపైకి చేరుకున్నాడు. కానీ, తిరిగి వచ్చే క్రమంలో అతనికి పట్టు జారిపోయింది. దీంతో రెండు బండరాళ్ల మధ్య చీలికలో చిక్కుకుపోయాడు. అక్కడి నుంచి బయటపడే మార్గం తోచలేదు.

సీఎం చొరవతో.. 
కొండ అంచు చీలిక భాగంలో రెండు రోజులుగా చిక్కుకుపోయి సోమవారం నుంచి ఆహారం, నీరు లేకుండా అక్కడే చిక్కుకుపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన చావు ఇలా రాసి ఉందా? అని యువకుడు అనుకున్నాడు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఆర్మీ సాయాన్ని కోరారు. దీంతో బుధవారం ఉదయానికి రెండు ఆర్మీ బృందాలు చేరాట్ కొండ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇందులో ఒకటి మద్రాస్ రెజిమెంట్ కు చెందిన బృందం. ఇందులో పర్వతాల అధిరోహణలో నైపుణ్యం కలిగిన సైనికులు ఉన్నారు. అలాగే, బెంగళూరు నుంచి పారాచ్యూట్ రెజిమెంట్ కు చెందిన 22 మంది సైనికుల బృందం అన్ని రకాల ఎక్విప్ మెంట్ తో చేరుకుంది.

ముందు తిండి.. ఆపై బాబును
సహాయ కార్యక్రమాలు బుధవారం ఉదయం 5.45 గంటలకు మొదలయ్యాయి. డ్రోన్ల సాయంతో బాబు జాడను గుర్తించారు. తొలుత అతడికి తిండి, నీరు అందించారు. ఆపై అతడికి కొంచెం ఓపిక వచ్చాక..  అనంతరం అక్కడి నుంచి క్షేమంగా కిందకు తీసుకొచ్చారు. కాగా, సురక్షితంగా ఒక ప్రాణం నిలబెట్టిన భారత్ ఆర్మీకి సోషల్​ మీడియా సలాం చెబుతోంది. కృతజ్క్షతలు చెప్పినవాళ్లలో కేరళ సీఎం పినరయి విజయ​న్​ కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు