ఢిల్లీ మహిళ ప్రపంచ రికార్డు... కాలినడకనే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా.. 110 రోజుల్లో

30 Mar, 2022 14:56 IST|Sakshi

Golden Quadrilateral Run: ఇంతవరకు మనం ఎంతో మంది సాధించిన ప్రపంచ రికార్డుల గురించి విన్నాం. తమదైన నైపుణ్యం, ప్రతిభను కనబర్చి సాధించినవారు కొందరూ. మరికొంతమంది వినూత్న ఆవిష్కరణలతో రికార్డులు సృష్టించారు. అచ్చం అలాంటి కోవకు చెందిందే ఢిల్లీకి చెందిన ఈ మహిళ.

వివరాల్లోకెళ్తే...ఢిల్లీకి చెందిన సుఫియా అనే అల్ట్రా రన్నర్‌ డిసెంబర్ 16, 2020న దేశ రాజధాని నుంచి తన పరుగును ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలను కలిపే జాతీయ రహదారుల నెట్‌వర్క్ అయిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ (బంగారు చతుర్భుజం)ని చుట్టి వచ్చింది ఈ 35 ఏళ్ల అథ్లెట్‌. ఆమె  6 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని సుమారు 110 రోజుల 23 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేసింది. నిజం చెప్పాలంటే ఇది అత్యంత సాహసోపేతమైన ప్రయాణం. ఆమె ఒక దశలో ప్రయాణాన్ని విరమించుకోవాలనుకుంది. అంతేకాదు ఆమెకు ఈ ప్రయాణంలో ఎన్నో గాయాలయ్యాయని అయినప్పటికీ తన లక్ష్యం పైన దృష్టి కేంద్రీకరించానని చెబుతోంది.

తాను ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పరుగును తన భర్త మద్దతుతోనే పూర్తి చేయగలిగానని చెప్పింది. అంతేకాదు ఈ ప్రయాణంలో తనతో దాదాపు అన్ని నగరాల్లోని  రన్నర్లు, సైక్లిస్టులు చేరారని తెలిపింది. ఈ ప్రయాణంలో తనకి కొంతమంది ప్రజలు ఆతిధ్యం ఇచ్చారని, ఒక్కోసారి రోడ్డు పక్కన షెల్టర్‌లోనే పడుకోవలసి  వచ్చిందని చెపింది.  ఈ మేరకు ఆదివారం ఆమె గిన్నిస్ సర్టిఫికేట్ అందుకున్న తర్వాత ఈ రికార్డును ధృవీకరించారు. అంతేకాదు ఆమె గతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా పరిగెత్తిన మహిళగా (87 రోజులు, 2 గంటలు, 17 నిమిషాలు; ఏప్రిల్ 25-జూలై 21, 2019) - తన పేరుతో మరొక గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. ప్రస్తుతం సుఫియా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, పూర్తి సమయం అల్ట్రా రన్నింగ్‌లో మునిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.

(చదవండి: విచిత్రమైన ఫిర్యాదు...మోదీ ఫోటో తీసేయమని బెదిరింపులు)

మరిన్ని వార్తలు