భూమి స్వాధీనం కేసులో రూ.2 కోట్ల పరిహారం

11 Apr, 2021 09:17 IST|Sakshi
చెక్కు అందజేస్తున్న జిల్లా జడ్జి సెల్వ సుందరి 

వేలూరు: భూమి స్వాధీనం కేసులో బాధితులకు రూ.2 కోట్ల పరిహారాన్ని జాతీయ లోక్‌ అదాలత్‌ జిల్లా న్యాయమూర్తి సెల్వసుందరి అందజేశారు. ఆమె అధ్యక్షతన శనివారం ఉదయం వేలూరు కోర్టులో లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పెండింగ్‌ కేసులను పరిష్కరించారు. వానియంబాడి తాలూకా వీరాంగకుప్పం గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నటరాజన్‌ రెండు ఎకరాల భూమిని 1988లో ఆది ద్రావిడ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంటి పట్టాల కోసం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలానికి నష్ట పరిహారాన్ని చెల్లించలేదు. దీంతో నటరాజన్‌ వానియంబాడి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

రెండేళ్ల క్రితం నటరాజన్‌ మృతి చెందడంతో అతని వారసులు కేసును కొనసాగించారు. విచారణ జరిపిన కోర్టు నటరాజన్‌ కుటుంబ సభ్యులకు రూ.కోటి 98 లక్షల 96,893లు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. అదే విధంగా వేలూరు తుత్తికాడుకు చెందిన సుదాకర్‌ 2015లో లారీలో వెళుతూ కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స సమయంలో అతని ఒక కాలును తీసి వేశారు. తనకు రూ.20 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. విచారించిన కోర్టు అతనికి రూ.17 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. శనివారం ఉదయం న్యాయమూర్తులు లత, వెర్టిసెల్వి, అరుణాచలం బాధితులకు చెక్కులు అందజేశారు. న్యాయవాదులు ఉమాశంకర్, రవికుమార్, శ్రీధరన్‌ పాల్గొన్నారు.
చదవండి: తమిళనాడు: మహిళా ఓటర్లే గెలుపు నిర్ణేతలు

మరిన్ని వార్తలు