రామమందిరం: మొఘల్‌ వారసుడి కానుక

27 Jul, 2020 09:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేవలం హిందువుల నుంచే కాదు, ఏ మతం వారు విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు, కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ప్రముఖ పెజావర్‌ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మొఘల్ వంశ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ అయోధ్య రామాలయానికి బంగారపు ఇటుకను కానుకగా ఇస్తానని ప్రకటించారు. కిలో బరువున్న ఇటుకను ప్రధాని నరేంద్ర మోదీకి అందిస్తానని, దీన్ని ఆలయ నిర్మాణంలో వాడవచ్చని ఆయన ప్రకటించారు. ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగబోతుంది. ఇది మనందరికి ఎంతో సంతోషకరమైన విషయం. నేను మాట ఇచ్చినట్లుగానే రామమందిర నిర్మాణానికి మొఘల్‌ వంశం తరపున కేజీ బంగారపు ఇటుకను ఇస్తున్నాను’ అని యాకుబ్‌ పేర్కొన్నారు.   ప్రధానిని కలిసేందుకు సమయం ఇవ్వాలని కూడా కోరానని ఆయన దగ్గర నుంచి పిలుపు రావాల్సి ఉందని చెప్పారు.

చదవండి: మందిరానికి విరాళాలు ఎవరిచ్చినా స్వీకరిస్తాం 

మొఘలుల వారసుడిగా చెప్పుకునే హబీదుద్దీన్ టూసీ గత సంవత్సరం తనను బాబ్రీ మసీదు కేర్ టేకర్ గా నియమించాలని డిమాండ్‌ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఆగస్టు 5వతేదీన మధ్యాహ్నం 12.15 గంటలకు అయోధ్య రామాలయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. కరోనా మహమ్మరి నేపథ్యంలో దీని కోసం  కొద్దిమంది ప్రముఖులనే ఆహ్వానిస్తున్నారు. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని  వైభవంగా జరిపించేందుకు ఉత్తరప్రదేశ్‌  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇప్పటికే రెండుసార్లు అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, తన సొంత డబ్బును విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఆకాశాన్నంటే రామ మందిరం

మరిన్ని వార్తలు