నూతన పార్లమెంట్‌కు ప్రధాని మోదీ భూమి పూజ

10 Dec, 2020 13:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ వెంకటేశ్‌ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌ తదితరులు హాజరయ్యారు. మొత్తం 200 మంది అతిథులు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుత భవనానికి వందేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలోనే ఈ కొత్త భవన నిర్మాణానికి సంకల్పించినట్లు కేంద్రం తెలిపింది. చదవండి: నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్‌

శంకుస్థాపన చేసిన ఈ కొత్త భవనం నిర్మాణాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్‌ భవనాన్ని రూ.971 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని పర్యావరణ హిత విధానాలను పెద్దపీట వేస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు చోటు ఉండేలా నిర్మాణం చేయనున్నారు. 

మరిన్ని వార్తలు