బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌

3 Oct, 2020 19:39 IST|Sakshi

లక్నో: హథ్రాస్‌ ఘటన బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయల్దేరిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ కాసేపటిక్రితం అక్కడకు చేరుకున్నారు. వారి వెంట మరో ముగ్గురిని మాత్రమే పోలీసులు అనుమతించారు. ఇక బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌ బాధితురాలికి న్యాయం జరిగేవరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. దేశంలో మహిళల భద్రతకు కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలాఉండగా.. గత గురువారం కూడా రాహుల్‌, ప్రియాంక హథ్రాస్‌ పర్యటకు బయల్దేరగా.. నొయిడా-ఢిల్లీ హైవేపై పోలీసులు అడ్డుకున్నారు.

కాంగ్రెస్‌ కార్యకర్తల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీచార్జి చేయగా.. రాహుల్‌ కిందపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా యోగి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తమైంది. శుక్రవారం కూడా అలాంటి ఘటనే జరిగింది. తృణమూల్‌ నేతలపైనా హథ్రాస్‌ సరిహద్దుల్లో లాఠీచార్జ్‌ జరిగింది. కాగా, హథ్రాస్‌ గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్‌ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం ఆమె మరణించింది.
(చదవండి: హథ్రాస్‌ ఘటనపై సీబీఐ విచారణ)

మరిన్ని వార్తలు