నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే.. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు

19 Jul, 2022 15:54 IST|Sakshi

న్యూఢిల్లీ: నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆమెపై ఎక్కడా కొత్త కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది.

తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ నూపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నూపుర్‌ శర్మను చంపేస్తామని బెదిరింపులు ఎక్కువయ్యాయని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నూపుర్ శర్మకు ప్రాణహాని ఉన్నది నిజమేనని వ్యాఖ్యానించింది. ఆమెకు ఊరటనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే నూపుర్ శర్మపై నమోదైన అ‍న్ని కేసులను  ఢిల్లీకి బదిలీ చేసే విషయంపై ఆగస్టు 10లోగా స్పందన తెలపాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, బెంగాల్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, జుమ్ముకశ్మీర్‌, అస్సాం ప్రభుత్వాలను సుప్రీంకోర్టు అడిగింది.

జులై1న నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది సుప్రీంకోర్టు. టీవీ డిబేట్‌లో బాధ్యత లేకుండా మాట్లాడటం వల్ల దేశంలో ఆమె అగ్గిరాజేసిందని మండిపడింది. దేశంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని ధ్వజమెత్తింది. ఆ తర్వాతి నుంచే నూపుర్ శర్మను చంపేస్తామనే బెదిరింపులు చాలా ఎక్కువయ్యాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ ఛిస్తీ, యూపీ చెందిన వ్యక్తి.. నూపుర్ శర్మను హతమారుమాస్తామని బెదిరించిన విషయాలను ప్రస్తావించారు.

చదవండి: వాట్సాప్‌ స్టేటస్‌గా నూపుర్‌ శర్మ వీడియో.. కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచారు?!

మరిన్ని వార్తలు