దారుణం.. ప్రాణం తీసిన జలుబు

18 Jan, 2021 20:37 IST|Sakshi

కశ్మీర్‌లో విషాదం.. జలుబుతో ఇద్దరు చిన్నారులు మృతి 

కశ్మీర్‌: వాతావరణ మార్పులు, డస్ట్‌ ఎలర్జీ ఉన్నవారు జలుబుతో బాగా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా వర్షా కాలం, చలి కాలల్లో ఈ సమస్య కాస్త తీవ్రంగా ఉంటుంది. డాక్టర్‌ దగ్గరకు వెళ్లడం.. చిట్కాలు పాటించడం వంటి చేసి తగ్గించుకుంటాం. కానీ జలుబుతో మృతి చెందడం అనేది చాలా చాలా అరుదు.. ఒకరకంగా చెప్పాలంటే అసంభవం కూడా. చివరకు సైనస్‌ లాంటి సమస్య ఉన్నా మరణించడం మాత్రం జరగదు. కానీ జమ్మూ కశ్మీర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. విపరీతంగా జలుబు చేసి.. ఇదర్దు సంచార జాతి పిల్లలు మరణించారు. వివరాలు.. ఓ సంచార జాతి కుటుంబం దక్షిణ కశ్మీర్‌లోని దేవ్సార్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారికి ఇల్లు లేదు. ఓ టార్పాలిన్ టెంట్‌లో ఉంటున్నారు. మాములు రోజుల్లో అయితే ఈ టెంట్‌ వారిని రక్షించేది. కానీ ఇది శీతాకాలం. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి మంచు కురుస్తుంది. ఈ అతి శీతల వాతావరణం నుంచి టెంట్‌ ఆ కుటుంబాన్ని కాపాడలేకపోయింది. దాంతో ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులకు జలుబు చేసింది. అది కాస్తా తీవ్రంగా మారి తీవ్రమైన జ్వరం వచ్చి చిన్నారులు ఇద్దరు మరణించారు. (చదవండి: ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా.. జాగ్రత్త!)

ఇక ఈ విషాదం గురించి తెలిసిన అనంతరం స్థానికులు వారికి తమ ఇళ్లలో ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘చిన్నారులిద్దరు బ్రైనల్ లామర్ గ్రామంలోని అడవుల్లో నివసిస్తున్న బేకర్వాల్ కుటుంబానికి చెందినవారు. వీరికి ఇల్లు లేదు. టార్పాలిన్ టెంట్‌లోనే నివాసం ఉంటారు. దాంతో చిన్నారులిద్దరికి జలుబు చేసి తీవ్ర రూపం దాల్చి మరణించారు. మరో ఇద్దరు సభ్యులకు కూడా అనారోగ్యంగా ఉండటంతో కుల్గాం ఆస్పత్రికి తరలించాము’అన్నారు. ఇక మృతుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. పిల్లలు మరణించారనే వార్త తెలిసిన తర్వాత అధికారులు వచ్చి బ్లాంకెట్స్‌ ఇచ్చి వెళ్లారు అన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో చలి తీవ్రంగా ఉంది. దాదాపు 40 రోజుల పాటు దారుణంగా భయపెట్టే ఈ కాలాన్ని స్థానికులు చిల్లై కలాన్ అంటారు. డిసెంబర్‌ 21 నుంచి జనవరి 31 వరకు ఉండే ఈ చిల్లై కలాన్‌లో ఉష్గోగ్రతలు దారుణంగా పడిపోతాయి. దాల్‌ సరస్సుతో సహా నీటి వనరులన్ని గడ్డకడతాయి. 

మరిన్ని వార్తలు