భారత్‌కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి

26 Oct, 2020 15:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌-అమెరికాల మధ్య రక్షణ, భద్రతా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సంప్రదింపులు జరిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌లు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సహకారంపైనా వీరు చర్చలు జరపనున్నారు. పాంపియో, ఎస్పర్‌ మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లతో చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సంప్రదింపులు చేపట్టనున్నారు.

చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో భారత్‌-అమెరికా మంత్రుల భేటీలో ఈ అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. పాంపియో, ఎస్పర్‌ లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తోనూ భేటీ అవుతారు. భారత్‌తో సరిహద్దు ప్రతిష్టంభనతో పాటు, దక్షిణ చైనా సముద్రంలో సైనిక పాటవాలు, హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై బీజింగ్‌ వైఖరి వంటి పలు అంశాలపై గత కొద్దినెలలుగా అమెరికా చైనా తీరును తప్పుపడుతోంది. ఇక అమెరికన్‌ మంత్రులతో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై సంప్రదింపులు సాగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఇప్పటికే స్పష్టం చేశారు.

చదవండి : చైనాతోనే అమెరికాకు ముప్పు

మరిన్ని వార్తలు