అనారోగ్యంతో ఉన్న అర్థాంగిని కాపాడుకునేందుకు ఇలా.. వైరల్‌ విషాదం

6 Apr, 2022 08:32 IST|Sakshi

ఓ వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న తన భార్యను రెండు చక్రాల బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన విషాదాంతమైంది. ఉత్తరప్రదేశ్‌ బలియా జిల్లా చిల్ఖార్‌ బ్లాక్‌ అందౌర్‌ గ్రామానికి చెందిన సకుల్‌ ప్రజాపతి.. తన భార్య జోగిని(55) ఇలా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. 

మార్చి 28న జోగిని తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఫోన్‌ చేసినా ఆంబులెన్స్‌ రాలేదు. సాయం కోరినా ఎవరూ స్పందించలేదు. మరో మార్గం లేక తన బండిపై పడుకోబెట్టి 3 కి.మీ.ల దూరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు ఆమెను పరీక్షించి, మందులిచ్చి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

ప్రజాపతి అక్కడే బండిలో తన భార్యను వదిలేసి, ఇంటికొచ్చి దుస్తులు, డబ్బు తీసుకుని తిరిగి.. కొందరిని బతిమాలి మినీ ట్రక్కులో బలియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యం కావడంతో.. వైద్యులు చికిత్స అందించినా లాభం లేకపోయింది. ఆమె కన్నుమూసింది. ఈ ఘటన వైరల్‌ కావడంతో.. ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు