Martyrs of Mumbai Attack: ఈ ఐదుగురు.. 26/11 అమర వీరులు!

26 Nov, 2023 07:38 IST|Sakshi

ముంబై మహానగరంలో 2008, నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడికి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. తాజ్, ట్రైడెంట్ హోటళ్లతో పాటు ఛత్రపతి శివాజీ టెర్మినస్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 166 మంది మృతి చెందారు. అయితే మనదేశానికి చెందిన వీర జవానులు, పోలీసులు ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొని ఎంతోమంది అమాయకుల ప్రాణాలను కాపాడారు. ఈ దాడిలో ఐదుగురు వీర జవానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరుల ధైర్యసాహసాలను మరోసారి గుర్తుచేసుకుందాం. 

హేమంత్ కర్కరే
హేమంత్.. ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అంటే ముంబై ఏటీఎస్ చీఫ్. హేమంత్‌ రాత్రి డిన్నర్ చేస్తుండగా నగరంలో ఉగ్రవాద దాడికి సంబంధించి క్రైమ్ బ్రాంచ్ నుండి కాల్ వచ్చింది. దీంతో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి, ఏసీపీ అశోక్ కామ్టే, ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌తో కలిసి డ్యూటీలోకి దిగారు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్‌లు అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ నేపధ్యంలోనే హేమంత్‌ వీరమరణం పొందారు. మరణానంతరం ఆయనకు అశోకచక్ర పురస్కారం లభించింది.

అశోక్ కామ్టే
అశోక్ ముంబై పోలీస్‌ విభాగంలో ఏసీపీ. ఉగ్రదాడి జరిగిన సమయంలో ఆయన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే బృందంలో ఉన్నారు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది ఇస్మాయిల్ ఖాన్ అతనిపై అనేక రౌండ్ల కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ అశోక్‌ తలకు తగిలింది. ఆయన తీవ్రంగా గాయపడినప్పటికీ, కొందరు శత్రువులను తుదముట్టించారు.

విజయ్ సలాస్కర్
సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సలాస్కర్ పేరు వినగానే  ముంబయి అండర్‌వరల్డ్‌ వణికిపోయేది. విజయ్ సలాస్కర్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. ముంబైలో దాడి జరిగినప్పుడు, విజయ్ సలాస్కర్ కూడా ఏటీఎస్‌ చీఫ్ హేమంత్ కర్కరే బృందంలో సభ్యుడు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల బుల్లెట్‌లకు సలార్కర్‌ వీరమరణం పొందారు. మరణానంతరం అతనికి అశోకచక్ర పురస్కారం లభించింది.

తుకారాం ఓంబ్లే
ముంబై పోలీస్‌ విభాగానికి చెందిన ఈ ఏఎస్‌ఐ ధైర్యాన్ని ప్రశంసించకుండా ఎవరూ ఉండలేరు. తుకారాం ఆయుధాలు లేకుండా ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఎదుర్కోవడమే కాకుండా, చివరికి అతన్ని పట్టుకోవడంలో కూడా విజయం సాధించారు. ఈ సమయంలో కసబ్ అతనిపై అనేక రౌండ్ల బుల్లెట్లను కాల్చాడు. ఫలితంగా తుకారాం అమరుడయ్యారు. మరణానంతరం అతనికి అశోకచక్ర పురస్కారం లభించింది.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్
ఉగ్రవాద దాడుల సమయంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మిషన్ ఆపరేషన్ బ్లాక్ టోర్నాడోకు నాయకత్వం వహించారు. అతను 51 ఎన్‌ఎస్‌ఏజీ కమాండర్. తాజ్ మహల్ ప్యాలెస్, టవర్స్ హోటల్ లోపల దాక్కున్న ఉగ్రవాదులతో మేజర్ పోరాడుతుండగా, ఒక ఉగ్రవాది అతనిపై వెనుక నుండి దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే వీరమరణం పొందారు. అతనికి మరణానంతరం 2009లో అశోకచక్ర పురస్కారం లభించింది.

ఈ ఐదుగురు వీర సైనికులు, పోలీసులతో పాటు హవల్దార్ గజేంద్ర సింగ్, నాగప్ప ఆర్. మహాలే, కిషోర్ కె. షిండే, సంజయ్ గోవిల్కర్, సునీల్ కుమార్ యాదవ్ తదిరులు నాడు జరిగిన పోరులో ధైర్యసాహసాలకు ఉదాహరణగా నిలిచారు.
ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌కు మరో ఆటంకం?

మరిన్ని వార్తలు