Delhi metro: మెట్రో రెయిలింగ్‌పై మహిళ హైడ్రామా..

12 Dec, 2023 10:47 IST|Sakshi

ఏదో ఒక కారణంతో ఢిల్లీ మెట్రో తరచూ ముఖ్యాంశాలలో నిలుస్తుంటుంది. కొందరు మెట్రోలో తమకు నచ్చినట్లు వ్యవహరిస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. తాజాగా మెట్రోలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఈ ఉదంతం మెట్రో అధికారులకు చిక్కులను తెచ్చిపెట్టింది. 

ఢిల్లీలోని షాదీపూర్ మెట్రో స్టేషన్‌లో ఒక మహిళ ఎలివేటెడ్ ట్రాక్‌ దాటి, రెయిలింగ్‌ ఎక్కి అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నించింది. దీనిని గమించిన కొందరు ప్రయాణికులు మెట్రో అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో వారు అతి కష్టం మీద ఆ మహిళను కాపాడారు. 
 

ఈ ఘటనకు సంబంధించిన 40 సెకన్ల వీడియో క్లిప్  వైరల్ అవుతోంది. ఓ మహిళ ఫోన్‌ పట్టుకుని ఎలివేటెడ్ మెట్రో ట్రాక్‌ పక్కన నిలబడి కనిపించింది. ఆమె ట్రాక్ పరిమితిని దాటి, రెయిలింగ్ పైకి ఎక్కినట్లు వీడియోలో కనిపిస్తోంది. షాదీపూర్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

ఎలివేటెడ్ ట్రాక్‌పై నుంచి దూకుతానంటూ ఆ మహిళ బెదిరించింది. ఆమెను కాపాడేందుకు అధికారుల బృందం ఫుట్‌పాత్‌ మీదుగా ట్రాక్‌ వైపు వెళ్లి ఆమెను రక్షించింది. కాగా ఆ మహిళ  ఎందుకు ఈ ప్రయత్నం చేసిందో స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం ఈ ఉదంతపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: శరద్ పవార్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్‌ ఛానల్‌ వీక్షించండి: 

>
మరిన్ని వార్తలు