జయపురం: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. నియోజకవర్గం పరిధిలోని బొరిగుమ్మలో సరస్వతీ శిశు మందిర్, ప్రజ్ఞాభారతి నూతన భవనాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తే దేశానికి సంపద కాగలరని పేర్కొన్నారు. నూతన భవనాల నిర్మాణం కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేసిన ఆయన, నిరుపేద విద్యార్థుల కోసం మరో రూ.లక్ష బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా బొరిగుమ్మ బ్లాక్ విద్యాధికారి సచిన్ మల్లిక్, విద్యా వికాస సమితి కో–ఆర్డినేటర్ సుకాంత కుమార్ బెహర, జయపురం సరస్వతీ శిశు మందిర్ పాఠశాల హెచ్ఎం లక్ష్మీకాంత మిశ్ర, పాఠశాల పరిచాలన కమిటీ అధ్యక్షుడు ప్రపుల్ల దండసేన, కార్యదర్శి సూర్యనారాయణ పండ, కోశాధికారి కాళీ పాత్రో, బృందావన పండ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్తో ఏనుగు మృతి
బరంపురం: గంజాం జిల్లా దిగపండి అటవీ రేంజ్ చీకిటి బ్లాక్ పరిధిలో గోవిందపూర్ పంచాయతీ పనడా గ్రామంలో శనివారం విద్యుత్ షాక్తో ఏనుగు మృతి చెందింది. సమాచారం అందుకున్న గుముసరా డివిజిన్ అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గత నాలుగు రోజుల నుంచి గుముసరా అటవీ ప్రాంతం నుంచి 13 ఏనుగుల గుంపు చికిటి బ్లాక్ పరిధి గ్రామాలకు శివారులోని వరి కుప్పలు తినేందుకు వస్తున్నాయి. అయితే ఈ సమయంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. పశు వైద్యుల సాయంతో పోస్టుమార్టం నిర్వహించి అక్కడే ఖననం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరి మృతి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి గుడుబలి పంచాయతీ బొర్తిబలి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుడు సమితిలోని కొదొమొచొర గ్రామానికి చెందిన రామమజ్జి(24)గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. తన గ్రామం నుంచి రామమజ్జి ఒక ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడితో కలిసి కాసీపూర్కు పనిమీద వెళ్లాడు. అనంతరం తిరిగి వస్తున్న సమయంలో బొర్తిబలి వద్ద ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే రామమజ్జి మృతి చెందాడు. ఆటో డ్రైవర్తో సహా బైకుపై వెనుక కూర్చున్న వ్యక్తి గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.