పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే మోదీని నిలదీయాలి 

2 Nov, 2021 03:30 IST|Sakshi

సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ 

ఆలకూరపాడు(టంగుటూరు): బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని కలిసి నడుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంతో పోరాడాలని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ సూచించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుటుంబసభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్కే, కుమారుడు మున్నా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం నారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రుడైన పవన్‌ చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కుపై మోదీని నిలదీయాలన్నారు. కర్మాగారం కాపాడుకునేందుకు దీక్ష చేపడతానని ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు.అలాగే ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రెండోసారి జరిగిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. శాసించే స్థాయి పదవిలో ఆయన ఉండి కూడా విశాఖ ఉక్కుపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.  

మరిన్ని వార్తలు