అక్బరుద్దిన్‌ వ్యాఖ్యల పై ఘాటుగా బదులిచ్చిన సంజయ్‌

25 Nov, 2020 18:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్ది జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. నేతలు కౌంటర్‌కి ఎన్‌కౌంటర్‌ గట్టిగానే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌, పీవీ సమాధులను కూల్చాలన్న ఎమ్మెల్యే అక్బరుద్దిన్‌ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఘాటుగా బదులిచ్చారు. ఒవైసీ నీకు దమ్ముంటే ఆ మహనీయులు సమాధులు ముట్టుకో చూద్దాం.. అదే జరిగితే మా కార్యకర్తలు క్షణాల్లో దారుసలాంని నేల మట్టం చేస్తారు అంటూ బండి సంజయ్‌ తీవ్రగా హెచ్చరించారు. దారుసలాంలో సౌండ్‌ చేస్తే ప్రగతి భవన్‌లో రీసౌండ్‌ వస్తుందని.. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి పాలన ఉందని అన్నారు. కనుక ఓటేసే ముందు అది ఏ పార్టీకి చేరుతుందో ప్రజలు గమనించాలని బండి సంజయ్‌ సూచించారు. (చదవండి: అక్బరుద్దీన్‌కు కేటీఆర్‌ కౌంటర్)

మాది ఢిల్లీ పార్టీయే అయినా గల్లీ గల్లీకి మా ప్రధాన మంత్రి పథకాలు ప్రజలకు అందుతున్నాయి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చింది అని కేసీఆర్‌ అంటున్నారు, అలా అయితే కేంద్ర నిధుల లేకుండా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర నిధులకు పేర్లు, ఫోటోలు మార్చి తన పథకాలుగా కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని ,ఈ విషయాన్నిదుబ్బా​క ప్రజలు గ్రహించారు కాబట్టే టీఆర్‌ఎస్‌ కు అక్కడ బుద్ది చెప్పారన్నారు బండి సంజయ్‌.

మరిన్ని వార్తలు