దేశానికి కాంగ్రెస్‌ చోర్‌ టీం

20 Oct, 2023 05:11 IST|Sakshi
గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన దివ్యాంగుల కృతజ్ఞత సభలో  కేటీఆర్‌కు దట్టీ కడుతున్న ఓ దివ్యాంగుడు  

ఆకాశం నుంచి పాతాళం దాకా దోచుకున్న చరిత్ర ఆ పార్టీదే 

కుటుంబ పాలన గురించి రాహుల్‌ మాట్లాడటం గొంగడిలో వెంట్రుకలు ఏరడమే 

దావూద్, చార్లెస్‌ శోభరాజ్‌ను మించిన దొంగ రేవంత్‌ 

10–12 మంది ఎమ్మెల్యేలు గెలిచినా బీజేపీకి గంపగుత్తగా అమ్మేస్తాడు 

దివ్యాంగుల సంక్షేమానికి తొమ్మిదిన్నరేళ్లలో రూ. 10,300 కోట్లు ఖర్చు చేశాం 

ఊత కర్రలా నిలిచిన కేసీఆర్‌కు ఎన్నికల్లో అండగా నిలవండి 

దివ్యాంగుల కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి కాంగ్రెస్‌ పార్టీ ‘సీ టీం’ (చోర్‌ టీమ్‌) అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు ఆరోపించారు. తమ పార్టీ బీజేపీకి ‘బీ–టీం’ అన్న కాంగ్రెస్‌ విమర్శలపై ఆయన మండిపడ్డారు. కుంభకోణాలతో ఆకాశం నుంచి పాతాళం దాకా దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన ‘దివ్యాంగుల కృతజ్ఞత సభ’లో కేటీఆర్‌ మాట్లాడారు. ‘రాహుల్‌ గాంధీ రామప్ప గుడికి వచ్చి గొంగడిలో వెంట్రుకలు ఏరినట్లు కుటు ంబ పాలన గురించి మాట్లాడారు. ఆయన లీడర్‌ కాదు.. ఇతరులు రాసింది చదివే రీడర్‌.

రేవంత్‌ లాంటి ఒక 420ని, గజదొంగను పక్కన పెట్టుకొని రాహుల్‌ మాట్లాడటం సిగ్గుచేటు. దావూద్‌ ఇబ్రహీం, చార్లెస్‌ శోభరాజ్‌ను మించిన గజదొంగ రేవంత్‌. నాడు నోటుకు ఓటు.. నేడు సీటుకు రేటు. ఒకవేళ ఎన్నికల్లో 10, 12 మంది ఎమ్మెల్యేలు గెలిచినా రాష్ట్ర కాంగ్రెస్‌ను బీజేపీకి గంపగుత్తగా రేవంత్‌ అమ్మేయడం ఖాయం’ అని కేటీఆర్‌ విమర్శించారు. రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఎక్కడైనా రూ. లక్ష కోట్ల అవినీతి జరుగు తుందా? అని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో సోనియా, రాహుల్‌ విచారణ ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు.

మోదీ, రాహుల్‌కు తెలంగాణ పౌరుషం చూపాలి..
‘తెలంగాణ ఉద్యమంలో ప్రజల మీదకు తుపాకీతో వెళ్లిన రైఫిల్‌రెడ్డి ఒకరైతే... రాజీనామా చేయకుండా అమెరికా పారిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరొకరు. ఇలాంటి వారితో కేసీఆర్‌కు పోటీనా? ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి బుద్ధిచెప్పేలా తెలంగాణ పౌరుషం చూపాలి’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ ఈ శతాబ్దంలో ఒకే ఒక్కడు..
‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నా రు. కేసీఆర్‌ లాంటి నాయకుడు శతాబ్దానికి ఒకరు వస్తారు. ఆయన ప్రభుత్వాన్ని వదులుకోవద్దు. దివ్యాంగుల సంక్షేమానికి తొమ్మిదిన్నరేళ్లలో రూ. 10,300 కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌ గఢ్‌లో దివ్యాంగులకు రూ. 200 చొప్పున, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రూ. 500 నుంచి రూ. వె య్యి వరకు మాత్రమే పింఛన్‌ ఇస్తున్నారు.

మేం మ ళ్లీ అధికారంలోకి రాగానే ప్రస్తుతమున్న రూ. 4,016 పింఛన్‌ను రూ. 6,016కు పెంచుతాం. దివ్యాం గులకు ఊత కర్రలా నిలిచిన కేసీఆర్‌కు ఎన్నికల్లో అండగా నిలవండి’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.వాసుదే వరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్‌ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నా థం, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు