టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

3 Aug, 2020 04:29 IST|Sakshi

కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా..

అమరావతి రైతులకు అండగా నిలబడండి: పవన్‌కల్యాణ్‌

సాక్షి, అమరావతి: రాజధాని రైతులకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. తమ ప్రాంతం నుంచి రాజధాని తరలిపోతున్నందున అమరావతిని నిలుపుకునేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలూ రాజీనామాలు చేసి పోరాటం చేయాలన్నారు. జనసేన పార్టీకి శాసన ప్రక్రియలో ఏ కొద్దిపాటి భాగస్వామ్యం ఉన్నా మొదటగా రాజీనామాలు చేసేదన్నారు. పవన్‌ అధ్యక్షతన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించింది. టెలీకాన్ఫరెన్స్‌లో పవన్‌ ఏమన్నారంటే..

► కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నివారణ చర్యలు చేపట్టలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజధాని వికేంద్రీకరణ క్రీడకు తెరతీసింది.
► అమరావతి నిర్మాణంలో ఇప్పటివరకు జనసేన ప్రమేయమేలేదు.
► రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులతో, నిపుణులతో కూలంకషంగా చర్చించి ముందుకు వెళ్తాం.

ఈ పరిస్థితికి కారకుడు చంద్రబాబే: నాగబాబు
రాజధాని తరలింపునకు కారకుడు చంద్రబాబేని జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు వ్యాఖ్యానించారు. ‘నాడు ఆయన చేసిన తప్పిదాలనే జగన్‌ అనుకూలంగా మార్చుకుని రాజధాని తరలిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. సమావేశంలో నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు