ప్రతిపక్షాలది స్వార్థ రాజకీయం

28 Dec, 2021 04:42 IST|Sakshi
మండిలో జరిగిన సభలో త్రిశూలంతో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ విమర్శ

మండి: ప్రతిపక్షాలది స్వార్ధంతో కూడిన రాజకీయమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రభుత్వ నిర్వహణలో ప్రస్తుతం రెండు నమూనాలున్నాయని, అందరితో కలిసి, అందరి నమ్మకం, అందరి కృషితో సాగే నమూనా తమది కాగా, సొంత ప్రయోజనాలు, స్వకుటుంబ స్వార్ధం, సొంతవారి ఎదుగుదల లక్ష్యంగా సాగే నమూనా విపక్షానిదని దుయ్యబట్టారు. అదేవిధంగా రెండు రకాల ఆలోచనాధోరణులుంటాయని, తమది వికాస్‌(అభివృద్ధి) ఆలోచన కాగా, విపక్షానిది విలంబ్‌(జాప్యం) ఆలోచన అని విమర్శిఃచారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో జైరామ్‌ఠాకూర్‌ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లైన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన సోమవారం పాల్గొన్నారు.

వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలకు డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం(కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వం) వల్ల అనేక ప్రయోజనాలు అందాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రంలో పలు అభివృద్ది ప్రాజెక్టులు వేగం     పుంజుకున్నాయని, వివిధ పథకాల అమలు జోరందుకుందని వివరించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని రూ. 28,197 కోట్ల విలువైన 287 పెట్టుబడి ప్రాజెక్టులను ఆరంభించారు. దీంతో పాటు రూ.11,581 కోట్ల విలువైన పథకాలకు శంకుస్థాపన చేశారు.

మరిన్ని వార్తలు