అందుకే బీజేపీని కాకుండా సంజయ్ను తిడుతున్నారు
మీడియాతో చిట్చాట్లో రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ భయంతోనే ప్రధాని మోదీ డైరెక్షన్లో సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లు పెట్టి బీజేపీని తిట్టినట్టు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, మోదీ– కేంద్రహోంమంత్రి అమిత్షాల బంధం గట్టిదని, అందుకే కేసీఆర్ తన ప్రెస్మీట్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను తిడుతున్నారేకానీ ఆ పార్టీని పల్లెత్తు మాట అనడంలేదని అన్నారు.
కేసీఆర్ ప్రెస్మీట్లు నాటు సరసంలా ఉన్నాయని, కాంగ్రెస్ను గేమ్ నుంచి తప్పించాలన్న వ్యూహం తోనే ఆయన ప్రెస్మీట్లు నడుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్ కొంపల్లిలో కాంగ్రెస్పార్టీ రాష్ట్రస్థాయి శిక్షణా తర గతులు ప్రారంభమైన సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. ‘కేసీఆర్ కుటుంబం అవినీతిలో మునిగిపోయిందని నిర్మల్ సభలో అమిత్షా చెప్పారు, కానీ వారి మధ్య ఉన్న బంధంతోనే కేసీఆర్ ధైర్యంగా ఉంటున్నారు’ అని పేర్కొన్నారు.
దేశంలో అత్యంత కీలకమైన వ్యక్తుల మీద కేసులు పెట్టిన ఢిల్లీ పెద్దలు కేసీఆర్ కుటుంబాన్ని మాత్రం టచ్ చేయలేదన్నారు. బండి సంజయ్ను సవాల్ చేసిన కేసీఆర్కు మోదీని సవాల్ చేసే దమ్ముందా అని రేవంత్ ప్రశ్నించారు.