63,425 పోస్టుల్ని ఎప్పుడు భర్తీ చేస్తారు?

27 Apr, 2022 03:59 IST|Sakshi
మక్తల్‌ మండలం లింగంపల్లి దగ్గర గడ్డి ట్రాక్టర్‌ నడుపుతున్న బండి సంజయ్‌

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పోలీస్‌శాఖలో 16,614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేశామని గొప్పలుపోతున్న ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఖాళీలను ప్రకటించిన 63,425 పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఆ పోస్టులను ఎంత కాలంలోగా భర్తీ చేస్తారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రజా సంగ్రామయాత్ర నుంచి సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ రాశారు. ప్రజా సంగ్రామయాత్ర మంగళవారం 13వ రోజు మక్తల్‌ మండలంలోని ఉప్పర్‌పల్లి నుంచి లింగంపల్లి వరకు సాగింది. ఎండలు అధికంగా ఉండటంతో ఐదు కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేశారు. 

లేఖలో పేర్కొన్న అంశాలు..
♦జూన్‌ 12న టెట్‌ పరీక్ష పూర్తయి ఫలితాలు రావడం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగే నాటికి సగం విద్యాసంవత్సరం పూర్తవుతుంది. విద్యా ఏడాది ప్రారంభంలోపు టీచర్‌ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
♦కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి రూ.3,016 చొప్పున నిరుద్యోగభృతి ఇవ్వాలి. ఈ మూడున్నరేళ్లలో బకాయిపడ్డ రూ.1,20,640 మొత్తాన్ని నిరుద్యో గులకు వెంటనే మంజూరు చేయాలి.
♦రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 50వేలు ఉన్నారు. కానీ, 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయనున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. వెంటనే మిగిలిన వారినీ రెగ్యులరైజ్‌ చేయాలి.  
♦ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై వెంటనే జాబ్‌కేలండర్‌ను ప్రకటించాలి. 

మరిన్ని వార్తలు