Huzurabad: మా అభ్యర్థిని ఇప్పుడే చెప్పం: రేవంత్‌ రెడ్డి

13 Jul, 2021 19:48 IST|Sakshi

కౌశిక్‌ రెడ్డి వ్యవహారం నాకు ముందే తెలుసు

ఇతర పార్టీల నేతలు చాలా మంది టచ్‌లోకి వస్తున్నారు

అన్ని సామాజిక వర్గాలకు కాంగ్రెస్‌లో సమన్యాయం ఉంటుంది: రేవంత్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. హుజూరాబాద్‌లో తమ పార్టీ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించమన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్‌లను నియమిస్తామని తెలిపారు. అన్ని సామజిక వర్గాలకు కాంగ్రెస్‌లో సమన్యాయం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎల్ రమణ కు నాలుగు సార్లు భోజనం పెట్టి.. కేసీఆర్ టీఆర్‌ఎస్‌లోకి తీసుకున్నారుని ఎద్దేవా చేశారు.

చాలా మంది ఇతర పార్టీల నేతలు టచ్‌లోకి వస్తున్నారని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ధర్మపురి సంజయ్ (మున్నూరు కాపు), ఎర్ర శేఖర్ (ముదిరాజ్), గండ్ర సత్యనారాయణ రావు (వెలమ సామజిక వర్గాలకు చెందిన వ్యక్తి) వంటి ముగ్గురు కీలక నేతలు వచ్చారన్నారు. వీరిలో ధర్మపురి సంజయ్ మాములు మనిషి కాదు.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ సోదరుడు అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కౌశిక్ చిన్న పిల్లగాడు.. ఆ మాటలు తనవి కావు.. కేసీఆర్ మాట్లాడించిన మాటలన్నారు. 

హుజురాబాద్‌లో తమ అభ్యర్థిని ఇప్పుడే చెప్పం అన్నారు రేవంత్‌ రెడ్డి. తనకు కౌశిక్ రెడ్డి వ్యవహారం ముందే తెలుసని.. ఆయన టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నాడని సమాచారం వుందన్నారు. హుజూరాబాద్‌లో కౌశిక్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్ ఇస్తారని అనుకోవడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తున్నా.. వారికీ అభ్యర్థి కరువయ్యాడు.. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతకు గాలం వేశారని విమర్శించారు. నిన్న పెట్రోల్, డీజిల్ పెంపుపై చేసిన ఆందోళన కు మంచి స్పందన వచ్చిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 
 

మరిన్ని వార్తలు