డ్రగ్‌ పరీక్షలకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమా?

22 Sep, 2021 07:53 IST|Sakshi

అమరుల స్తూపాన్ని తాకే అర్హత రేవంత్‌రెడ్డికి లేదు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గువ్వల, కిశోర్, జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతల మధ్య ‘డ్రగ్‌ ఆఫ్‌ వార్‌’నడుస్తోంది. ఈ వ్యవహారం కుటుంబసభ్యులను లాగే వరకూ వెళ్లింది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నేతలందరూ డ్రగ్‌ పరీక్షలు చేసుకుంటే తామూ సిద్ధంగా ఉన్నామని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులకు కూడా నార్కో పరీక్షలు చేయించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సవాల్‌ చేశారు. జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో డ్రగ్‌ పరీక్షకు రావాలంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ చైర్మన్‌ ఎ.జీవన్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ మంగళవారం ఇక్కడి టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను ఏదో యుద్ధం చేస్తున్నట్లు ప్రజల్లో భ్రమలు కలి్పంచేలా రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని బాలరాజు విమర్శించారు. రేవంత్‌ తీరు మారకుంటే ఆయన దుర్మార్గాలు, అరాచకాలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎండగడతామని హెచ్చరించారు. అమరుల స్తూపాన్ని తాకే అర్హత రేవంత్‌కు లేదని అన్నారు. 

అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌ కేటీఆర్‌ 
ఐటీ, పారిశ్రామిక రంగాల్లోకి పెట్టుబడులు రాబ డుతూ హైదరాబాద్‌ ప్రతిష్టను పెంచుతున్న కేటీఆర్‌ అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని, రేవంత్‌రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. రాహుల్‌ అమెరికాలో డ్రగ్స్‌ కేసులో పట్టుబడినట్లు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి గతంలో ఆరోపించారని, ఈ అంశంపై పత్రికల్లో వార్తలు కూడా వచ్చా యని గుర్తుచేశారు. రేవంత్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీని రక్షించుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు సూ చించారు. నేతల వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడం ద్వారా రాజకీయపబ్బం గడుపుకునే చర్యలను రేవంత్‌ మానుకోవాలని కిశోర్‌ హితవు పలికారు.   
 

మరిన్ని వార్తలు