WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్‌

2 Jun, 2023 10:26 IST|Sakshi

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. జూన్‌ 7 నుంచి లండన్‌ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌ జట్టుకు విరాట్‌ కోహ్లి, ఛెతేశ్వర్ పుజారా నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఇక ప్రతిష్టాత్మక ట్రోఫీని సొంతం చేసుకోవడానికి ఇరుజట్లు లండన్‌లో తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి.

"ఆస్ట్రేలియా జట్టు విరాట్‌ కోహ్లి గురించి ప్రణాళికలు రచిస్తోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. విరాట్‌తో పాటు పుజారా కోసం కూడా వారు చర్చించుకుంటారు. కోహ్లి ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు గత కొన్ని రోజులుగా టీ20 క్రికెట్‌ ఆడుతున్నప్పటికీ.. అంతకుముందు వన్డే, టెస్టుల్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.

కాబట్టి ఇంగ్లండ్‌ గడ్డపై కూడా రాణిస్తాడని నేను భావిస్తున్నాను. కాబట్టి కోహ్లి పట్ల ఆసీస్‌ చాలా జాగ్రత్త వహించాలి. ఇక పుజారా గత కొన్ని రోజులుగా ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతున్నాడు. అక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడ్డాడు. గతంలో కూడా కోహ్లి, పుజారా ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. పుజారాను వీలైనంత వేగంగా పెవిలియన్‌కు పంపితే ఆసీస్‌కు మంచింది. అతడు ఒక్కసారి క్రీజులో నిలదొక్కకుంటే ఔట్‌ చేయడం చాలా కష్టమని" ది ఐసీసీ రివ్యూలో పాంటింగ్‌ పేర్కొన్నాడు.
చదవండి: ENG vs IRE: ఐదు వికెట్లతో చెలరేగిన బ్రాడ్‌.. 172 పరుగులకే ఐర్లాండ్‌ ఆలౌట్‌

మరిన్ని వార్తలు