‘శత’క్కొట్టిన బాబర్‌ ఆజమ్‌.. తొలిసారిగా

15 Apr, 2021 08:27 IST|Sakshi

59 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 122 పరుగులు చేసిన పాక్‌ కెప్టెన్‌

రిజ్వాన్‌తో తొలి వికెట్‌కు 197 పరుగుల భాగస్వామ్యం

మూడో టి20లో దక్షిణాఫ్రికాపై పాక్‌ ఘనవిజయం

సెంచూరియన్‌: వన్డే ఫార్మాట్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకున్న ఆనందంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. సఫారీ బౌలర్లను చితగ్కొట్టి కేవలం 59 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ టి20ల్లో ఆజమ్‌కిదే తొలి శతకం కావడం విశేషం. తద్వారా అంతర్జాతీయ టి20ల్లో వేగంగా శతకం కొట్టిన పాక్‌ బ్యాట్స్‌మన్‌గా... టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన పాక్‌ బ్యాట్స్‌మన్‌గా ఆజమ్‌ గుర్తింపు పొందాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 18 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 205 పరుగులు సాధించి గెలిచింది.

కాగా అంతర్జాతీయ టి20ల్లో పాక్‌కిదే అత్యుత్తమ ఛేజింగ్‌. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బాబర్‌ ఆజమ్‌ (59 బంతుల్లో 122; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (47 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 17.4 ఓవర్లలో 197 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. జానెమన్‌ మలాన్‌ (40 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్క్‌రమ్‌ (31 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. తొలి వికెట్‌కు 108 పరుగులు జత చేశారు. సిరీస్‌లోని చివరిదైన నాలుగో టి20 మ్యాచ్‌ శుక్రవారం జరుగుతుంది.  

చదవండి: సుదీర్ఘ కాలంగా టాప్‌లో కోహ్లి; ఇప్పుడు అగ్రస్థానంలో పాక్‌ కెప్టెన్‌‌ 

మరిన్ని వార్తలు