BAN VS ZIM 1st T20: సికందర్‌ రాజా ఊచకోత.. బంగ్లాకు షాకిచ్చిన జింబాబ్వే

30 Jul, 2022 21:12 IST|Sakshi

Sikander Raja: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో జింబాబ్వేకు శుభారంభం దక్కింది. శనివారం (జులై 30) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే సంచలన ప్రదర్శన నమోదు చేసి 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసిం‍ది.

వెస్లీ మదెవెరె (46 బంతుల్లో 67 రిటైర్డ్‌ హర్ట్‌; 9 ఫోర్లు), సికందర్‌ రాజా (26 బంతుల్లో 65 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించి జట్టు భారీ స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. సీన్‌ విలియమ్స్‌ (19 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ముఖ్యంగా సికందర్‌ రాజా బంగ్లా బౌలర్లపై శివాలెత్తి సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాది ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ 2 వికెట్లు పడగొట్టగా.. మొసద్దెక్‌ హొసేన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.  

అనంతరం ఛేదనలో బంగ్లా ఆటగాళ్లు కూడా గట్టిగానే ప్రయత్నించినప్పటికీ విజయానికి 17 పరుగుల దూరంలోనే (188/6) నిలిచిపోయారు. కెప్టెన్‌ నరుల్‌ హసన్‌ (26 బంతుల్లో 42 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు), లిటన్‌ దాస్‌ (19 బంతుల్లో 32; 6 ఫోర్లు) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. జింబాబ్వే బౌలర్లలో లూక్‌ జాంగ్వి 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్‌ ఎంగరవా, వెల్లింగ్టన్‌ మసకద్జా, సికందర్‌ రాజా తలో వికెట్‌ సాధించారు. సిరీస్‌లో రెండో టీ20 రేపు (జులై 31) జరుగనుంది. అనంతరం ఆగస్ట్‌ 2న మూడో టీ20.. 5, 7, 10 తేదీల్లో 3 వన్డేలు జరుగనున్నాయి. 
చదవండి: రోహిత్‌కు జతగా ధవన్‌ ఉండగ, ఈ ప్రయోగాలు ఎందుకు దండగ..!

మరిన్ని వార్తలు