మలింగ తరహాలో అరుదైన ఫీట్‌.. అయినా ఓడిపోయారు

2 Mar, 2021 17:03 IST|Sakshi

కోల్‌కత: అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్‌ తీయడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీయడం అసాధారణం. ఈ ఫీట్‌ను అందుకున్న తొలి బౌలర్‌గా శ్రీలంక స్టార్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ రికార్డు సృష్టించాడు. అతను ఈ ఫీట్‌ను రెండుసార్లు అందుకోవడం మరో విశేషం. తొలిసారి మలింగ 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫీట్‌ను సాధించగా ఆ మ్యాచ్‌లో లంక ఓడిపోవడం విశేషం.. రెండోసారి 2019లో కివీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మరోసారి అందుకున్నాడు. మలింగతో పాటు ఆప్ఘన్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ కూడా 2019లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. 


తాజాగా బెంగాల్‌ క్లబ్‌ క్రికెట్‌లో మరోసారి ఆ ఫీట్‌ ఆవిష్కృతమైంది. ఎన్‌సీ చటర్జీ ట్రోపీలో భాగంగా మోహున్‌లాల్‌ క్లబ్‌, హౌరా యూనియన్‌ మధ్య ఆదివారం కోల్‌కతాలో మ్యాచ్‌ జరిగింది. మోహున్‌లాల్‌ క్లబ్‌ బౌలర్‌ మసూమ్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. వరుస బంతుల్లో అబ్దుల్‌ హదీ(32 పరుగులు), దీప్తా నారాయన్‌ అడక్‌(38 పరుగులు), సాయికత్‌ సంజా(0), దిపాన్యన్‌ రాహా(0)లను ఔట్‌ చేశాడు. దీంతో పాటు ఓపెనర్‌ ఎండీ షానవాజ్‌ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా మొత్తం నాలుగు ఓవర్ల కోటాలో 13 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అతని దాటికి హౌరా యూనియన్‌ 7వికెట్ల నష్టానికి 160 పరుగులకు పరిమితమైంది. అయితే మసూమ్‌ ఇంత మంచి ప్రదర్శన చేసినా మెహురూన్‌ క్లబ్‌ 114 పరుగులకే ఆలౌట్‌ అయి మ్యాచ్‌ ఓడిపోయింది. తన ప్రదర్శన​​కు మాత్రం మసూమ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
చదవండి: 12 ఏళ్ల బంధానికి ముంబై ఇండియన్స్‌ గుడ్‌బై
'అందుకే ఐపీఎల్‌ నుంచి పక్కకు తప్పుకున్నా'

మరిన్ని వార్తలు