Test Cricket: ఇది ఆటంటే.. టెస్టు మజా ఏంటో చూపించింది

30 Nov, 2021 13:56 IST|Sakshi

Cricketers Praise Test Cricket Entertainment.. టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య ముగిసిన తొలి టెస్టు ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈరోజుల్లో మూడు.. నాలుగు రోజుల్లో ముగిసిపోతున్న టెస్టు మ్యాచ్‌లకు విరుద్దంగా ఆట ఐదోరోజు ఆఖరివరకు సాగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా సాగినప్పటికీ కివీస్‌ టెయిలెండర్ల అసాధారణ పోరాటంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 52 బంతులపాటు ఓపికగా ఆడిన రచిన్‌ రవీంద్ర, ఎజాజ్‌ పటేల్‌లు కివీస్‌ను ఓటమి నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్‌లో ఉండే మజాను మరోసారి రుచి చూశామని పలువురు క్రికెటర్లు ట్విటర్‌లో స్పందించారు. 

డేవిడ్‌ వార్నర్‌..'' టెస్టు క్రికెట్‌ అంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఐదు రోజుల పాటు రెండు జట్లు ఎంతో కష్టపడి ఆడాయి. టీమిండియా విజయం కోసం శ్రమించినప్పటికి డ్రాతో ముగిసింది. అందుకే నాకు టెస్టు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఇక ముంబై టెస్టుకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా.. యాషెస్‌ సిరీస్‌కోసం అంతకు మించి ఎదురుచూస్తున్నా''

వీరేంద్ర సెహ్వాగ్‌.. '' టెస్టు క్రికెట్‌ అంటే మజా వేరుగా ఉంటుంది. టి20, వన్డేలు సంప్రదాయ క్రికెట్‌ ముందు పనికిరావు. ఓటమి నుంచి తప్పించుకోవడానికి న్యూజిలాండ్‌ చాలా కష్టపడింది. టీమిండియా తృటిలో విజయం నుంచి దూరమవడం నిరాశ కలిగించింది. ఇక ముంబై టెస్టులోనే ఫలితం కోసం ఎదురుచూడాలి.''

వీవీఎస్‌ లక్ష్మణ్‌.'' ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. న్యూజిలాండ్‌ ఓటమి నుంచి తృటిలో తప్పించుకుంది. రచిన్‌ .. ఎజాజ్‌లు టీమిండియా గెలుపుకు అడ్డుగోడగా నిలబడ్డారు. టీమిండియాకు గెలుపు దూరం కావడం నిరాశ కలిగించింది.''

మరిన్ని వార్తలు