Dinesh Karthik: ధావన్‌ పని అయిపోయింది? గబ్బర్‌పై దినేశ్ కార్తీక్‌ సంచలన వ్యాఖ్యలు

12 Dec, 2022 18:09 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ధావన్‌ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అయితే బంగ్లాతో ఆఖరి వన్డేలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌ అద్భుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

కిషన్‌ సంచలన ఇన్నింగ్స్‌తో ధావన్‌ కెరీర్‌కు తెరపడినట్లే అని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధావన్‌ కెరీర్‌పై టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. యువ ఆటగాళ్లు కిషన్‌, గిల్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున ధావన్‌ వన్డే కెరీర్‌ ముగిసినట్లే అని కార్తీక్‌ అభిప్రాయపడ్డాడు.

"స్వదేశంలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు ధావన్‌కు చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే ఓపెనింగ్‌ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ను పక్కన పెట్టే సాహసం సెలక్టర్లు చేయరు అనుకుంటున్నా. మరోవైపు శుబ్‌మాన్‌ గిల్‌ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. రోహిత్‌ శర్మ తిరిగి జట్టులోకి వస్తే వీరి ముగ్గురిలో ఎవరైనా తప్పుకోవాల్సి వస్తుంది.

నా అంచనా ప్రకారం అది ధావన్‌ కావచ్చు. ఇది అద్భుతమైన శిఖర్‌ కెరీర్‌కు విషాదకరమైన ముగింపు కావచ్చు. ఒక వేళ ధావన్‌ జట్టుకు ఎంపిక అయినా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టం. అయితే ఈ ప్రశ్నలన్నింటికి కొత్తగా వచ్చే సెలక్టర్లే సమాధానం చెప్పాల్సి ఉంటుంది" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్‌ పేర్కొన్నాడు.
చదవండి: టీమిండియా అత్యుత్తమ వన్డే జట్టు.. సూర్యకుమార్‌ యాదవ్‌కు నో ఛాన్స్‌!

మరిన్ని వార్తలు